రేపట్నుంచి 15 వరకు జిల్లాలో పాదయాత్రలు

ABN , First Publish Date - 2022-08-08T05:47:48+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలతో ఆ సంతోషాన్ని పంచుకునేందుకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుంచి 15 వరకు పాదయాత్రలు నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

రేపట్నుంచి 15 వరకు జిల్లాలో పాదయాత్రలు
మాట్లాడుతున్న అనీల్‌కుమార్‌రెడ్డి

భువనగిరి టౌన్‌, ఆగస్టు 7: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలతో ఆ సంతోషాన్ని పంచుకునేందుకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 9వ తేదీ నుంచి 15 వరకు పాదయాత్రలు నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం భువనగిరిలో బోనాల వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో వారం రోజులపాటు 75 మందితో కూడిన కాంగ్రెస్‌ బృందం త్రివర్ణపతాకాలతో 75 కిలోమీటర్లపాటు పాదయాత్ర చేస్తుందన్నారు. జిల్లాలోని ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, స్వాతంత్య్రం కోసం  పోరాడిన మహత్మాగాంధీ, బాలగంగాధర తిలక్‌, మోతీలాల్‌ నెహ్రూ, సర్దార్‌పటేల్‌ తదితర యోధుల గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. పార్టీలకతీతంగా ప్రజలందరూ పాదయాత్రల్లో పాల్గొనాలన్నారు. స్వాతంత్య్రం లభించాక తొలి ప్రధానిగా పండిత్‌ నెహ్రూ అందించిన అభివృద్ధి పాలన, అమల్లోకి తెచ్చిన సంస్కరణలను కూడా ప్రజలకు వివరిస్తామన్నారు. ఆయనవెంట కాంగ్రెస్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు బీసుకుంట్ల సత్యనారాయణ, పీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్‌, కె సోమయ్య, తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-08-08T05:47:48+05:30 IST