బీజింగ్ ఒలింపిక్స్ దౌత్య బహిష్కరణ.. పాకిస్థాన్ మండిపాటు

ABN , First Publish Date - 2021-12-12T22:05:12+05:30 IST

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో ప్రారంభం కానున్న శీతాకాల ఒలింపిక్స్‌ను పలు దేశాలు దౌత్య బహిష్కరణ చేయడాన్ని

బీజింగ్ ఒలింపిక్స్ దౌత్య బహిష్కరణ.. పాకిస్థాన్ మండిపాటు

ఇస్లామాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో ప్రారంభం కానున్న శీతాకాల ఒలింపిక్స్‌ను పలు దేశాలు దౌత్య బహిష్కరణ చేయడాన్నిపాకిస్థాన్ తప్పుబట్టింది. క్రీడల్లో రాజకీయాలేంటని ప్రశ్నించింది. రాజకీయాలను క్రీడలకు దూరంగా పెట్టాలని హితవు పలికింది. ఇలాంటి చర్యలను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తేల్చి చెప్పింది.


పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి అసీం ఇఫ్తికార్ మీడియాతో మాట్లాడుతూ.. క్రీడల్లో రాజకీయాలు ఎలాంటి రూపంలో ఉన్నా పాకిస్థాన్ వాటిని వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. దేశాలన్నీ కలిసి రావాలని, బీజింగ్ ఒలింపిక్స్‌లో తమ క్రీడాకారులు పాల్గొనేలా చేసి, వారి ప్రతిభాపాటవాలను నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని కోరారు.

 

చైనాలో యథేచ్ఛగా మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాలు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించాయి. తమ ప్రతినిధులను పంపబోమని తేల్చి చెప్పాయి.


అయితే, గేమ్స్‌లో పాల్గొనే విషయంలో తమ క్రీడాకారులను మాత్రం అడ్డుకోబోమని, వారిపై ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశాయి. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఇఫ్తికార్.. బీజింగ్ ఒలింపిక్స్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 

Updated Date - 2021-12-12T22:05:12+05:30 IST