Trade Rout: వరదల వేళ భారత్పై కీలక నిర్ణయం తీసుకున్న పాక్
ABN , First Publish Date - 2022-08-30T01:28:45+05:30 IST
రుతుపవనాల కారణంతో వరదలతో అల్లాడుతున్న పాకిస్థాన్ కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: రుతుపవనాల ప్రభావం అతితీవ్రంగా ఉండటంతో వరదల (Floods) బారిన పడి అల్లాడుతున్న పాకిస్థాన్ (Pakistan) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో వాణిజ్య మార్గాన్ని (Trade Rout) పునరుద్ధరించనున్నట్టు (Resume) పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్ ఇస్మాయిల్ సోమవారంనాడు తెలిపారు. వరదలు, పెరిగిపోతున్న ఆహార ధరల కారణంగా భారత్తో వ్యాపార మార్గాలను పునరుద్ధరించనున్నామని మంత్రి చెప్పినట్టు పాక్ మీడియా కథనాలు ప్రచురించింది.
ఈ ఏడాది జూలై నుంచి అసాధారణ రుతుపవనాల కారణంతో పాకిస్థాన్ వర్షాలు, వరదలతో అల్లాడుతోంది. దేశంలోని 3.3 కోట్ల మంది ప్రజలపై ఈ ప్రభావం పడినట్టు పాక్ పత్రిక 'డాన్' ఒక కథనం ప్రచురించింది. ఐక్యరాజ్యసమితి, ఇతర మానవతా ఏజెన్సీల సహకారంతో మానవతా సహాయక చర్యలు చేపడుతున్నట్టు క్లైమైట్ ఛేంజ్ శాఖ మంత్రి షెర్రీ రెహ్మాన్ తెలిపారు. ఎనిమిది వారాలుగా కురుస్తున్న వర్షాలను దేశంలో మునుపెన్నడూ చూడలేదన్నారు. నౌషెరాలోని కాబూల్ నదిలో వరద స్థాయితో పాటు ఇండస్ వరద నీటి ప్రవాహం చాలా ఉధృతంగా ఉందన్నారు. ఆహార, ఔషధ సరఫరా కూడా కష్టంగా మారుతోందని, ఎన్డీఎంఏ, పాకిస్థాన్ ఆర్మీ సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.
ఎన్డీఎంఏ తాజా గణాంకాల ప్రకారం, ఈ వర్షాకాలం సీజన్ మొదలైనప్పటి నుంచి వర్షాలు, వరదల కారణంగా 1,061 మంది మృత్యువాత పడ్డారు. 1,575 మంది గాయపడ్డారు. గత 24 గంటల్లో, 11 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు సహా 29 మంది మృతి చెందగా, 48 మంది గాయపడ్డారు. 9,92,871 ఇళ్లు, 170 వంతెనలు, 157 దుకాణాలు ధ్వంసమయ్యాయి.