పాక్ సైన్యం-తాలిబన్ల మధ్య భీకర కాల్పులు
ABN , First Publish Date - 2021-12-26T02:31:49+05:30 IST
డ్యూరండ్ రేఖ వెంబడి పాక్ సైన్యం, తాలిబన్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించిన..
కాబూల్: డ్యూరండ్ రేఖ వెంబడి పాక్ సైన్యం, తాలిబన్ల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిన్న (శుక్రవారం) దాదాపు అరగంటపాటు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. సరిహద్దు వద్ద ఉన్న ఫెన్సింగ్ను తాలిబన్ సైన్యానికి చెందిన వ్యక్తి తొలగిస్తున్న సమయంలో ఇద్దరు పాక్ సైనికులు అడ్డుకున్నారు.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి వారిని కాల్చి చంపడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆఫ్ఘనిస్థాన్, పాక్ వైపు నుంచి ప్రకటన వెలువడింది. ఉద్రిక్తతలు మణిగినట్టు పేర్కొన్నాయి. అయితే, కాల్పులు కారణంగా సంభవించిన నష్టం గురించి మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య కొన్నేళ్లుగా సరిహద్దు వివాదం ఉంది. ఆఫ్ఘన్ సరిహద్దు వద్ద 26 వేల కిలోమీటర్ల మేర కంచె పనుల్ని పూర్తి చేయగా, తాలిబన్లు ఆ ఫెన్సింగును కత్తిరించి స్క్రాప్లో అమ్మేసుకుంటున్నట్టు పాక్ ఆరోపిస్తోంది. కాగా, రెండు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం పరిష్కారమైందని ఇరు దేశాలు ఇటీవల ప్రకటించాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ కాల్పులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.