POKలో యురేనియం కోసం పాక్ అక్రమ తవ్వకాలు

ABN , First Publish Date - 2021-09-19T00:08:19+05:30 IST

పాక్ అక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్‌లో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి యురేనియం తవ్వకాలు చేపట్టేందుకు పాక్ సర్కారు కసరత్తు ప్రారంభించినట్లు స్థానిక ప్రజలు, నాయకుల ద్వారా నిర్ధారణ అయ్యింది.

POKలో యురేనియం కోసం పాక్ అక్రమ తవ్వకాలు

ఇస్లామాబాద్: పాక్ అక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్‌లో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి యురేనియం తవ్వకాలు చేపట్టేందుకు పాక్ సర్కారు కసరత్తు ప్రారంభించినట్లు స్థానిక ప్రజలు, నాయకుల ద్వారా నిర్ధారణ అయ్యింది. అటామిక్ ఎనర్జీ మెటీరియల్ సెంటర్ (ఏఈఎమ్‌సీ)కు చెందిన పాక్ అధికారులు గిల్గిత్-బాల్టిస్తాన్‌లోని హైదరాబాద్ ప్రాంతాన్ని పరిశీలించారని వారు తెలిపారు. దీనితో పాటు ఖైబర్-పఖ్తుంఖ్వా ఫ్రావిన్స్‌లో యురేనియం ఉందని గుర్తించిన ప్రాంతాలను కూడా వారు సందర్శించారని వివరించారు. గిల్గిత్-బాల్టిస్తాన్ ఉన్న సహజవనరులను చైనా తవ్వుకోవడానికి గతంలోనే పాకిస్తాన్ ఒప్పుకుందని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో ఉన్న బంగారం, యురేనియం, మోలిబ్డినం లాంటి ఖనిజాలను తవ్వుకోవడానికి చైనా సంస్థలకు పాకిస్తాన్ రాచబాట పరిచిందని ఆ నివేదికలు బయటపెట్టాయి.


పీఓకేకి చెందిన రాజకీయ నాయకుడు అంజాద్ అయూబ్ మీర్జా మీడియాకు సమాచారం ఇస్తూ.. ‘‘చైనాకు చెందిన జియాలజిస్టుల బృందం యురేనియం నిక్షేపాలు అధికంగా ఉన్న హంజా-నగర్ జిల్లాను సందర్శించింది. ఈ బృందంలో పాకిస్తాన్ వారు కూడా ఉన్నారు. ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను గతంలోనే అసిఫ్ అలీ జర్దారీ ప్రభుత్వం చైనాకు లీజుకిచ్చింది. ఆ వివరాలను ఇప్పటి వరకు బహిరంగపరచలేదు. షహజాద్ ఇంటర్నేషనల్ అనే సంస్థ గిల్గిత్-బాల్టిస్తాన్‌లో యురేనియాన్ని తవ్వుతోంది.  చైనా యురేనియం తవ్వకాలు చేపడుతుండటంతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. పాకిస్తాన్ కూడా ఖైబర్-పఖ్తుంఖ్వా ఫ్రావిన్స్‌‌లో యురేనియం తవ్వకాలకు ఉన్న అవకాశాల గురించి పరిశీలిస్తోంది ’’ అని వివరించారు. పాకిస్తాన్ 2020లోనే యురేనియం తవ్వకాలను ప్రారంభించాలనుకుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.2416 మిలియన్లకు పైగా ధనాన్ని వెచ్చించాలనుకుంది. కానీ, అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు.

Updated Date - 2021-09-19T00:08:19+05:30 IST