పల్ల వెంకన్న జీవితం ఆదర్శప్రాయం

ABN , First Publish Date - 2021-10-18T05:49:31+05:30 IST

ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దేశానికి తలమానికమైన నర్సరీ రంగాన్ని సృష్టించిన పల్ల వెంకన్న జీవితం అందరికీ ఆదర్శమని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

పల్ల వెంకన్న జీవితం ఆదర్శప్రాయం
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వెంకయ్యనాయుడు, తదితరులు

  ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ

కడియం, అక్టోబరు 17: ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దేశానికి తలమానికమైన నర్సరీ రంగాన్ని సృష్టించిన పల్ల వెంకన్న జీవితం అందరికీ ఆదర్శమని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఎమెస్కో రూపొందించిన ‘నర్సరీ రాజ్యానికి రారాజు పల్ల వెంకన్న’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో హరిత వాతావరణాన్ని నింపుతూ ఎంతో మందికి ఉపాధి మార్గం చూపిన పల్ల వెంకన్న జీవిత చరిత్రను చాటిచెప్పే ఈ పుస్తకం ఆంగ్ల, హిందీ మాధ్యమాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అంగవైకల్యం ఉన్నా దానిని ప్రత్యేక హోదాగా మలుచుకుని అసమాన్య ప్రతిభను కనబరిచిన పల్ల వెంకన్న అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మరో అతిథి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌  మాట్లాడుతూ పల్ల వెంకన్న మొక్కలతో మాట్లాడేంతగావాటితో మమేకమై ఆ రంగంలో శ్రమపడ్డారని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ ఆలీ, అధికార బాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌, ఎమెస్కో సంస్థ సీఈవో విజయకుమార్‌, రచయిత వల్లీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T05:49:31+05:30 IST