స్కాట్లాండ్‌లో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ..!

ABN , First Publish Date - 2021-05-11T17:20:38+05:30 IST

భారత సంతతి మహిళ పామ్ గోసల్ స్కాట్లాండ్‌లో చరిత్ర సృష్టించారు. ఆ దేశ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా గోసల్ చరిత్రాకెక్కారు.

స్కాట్లాండ్‌లో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ..!

ఎడిన్బర్గ్: భారత సంతతి మహిళ పామ్ గోసల్ స్కాట్లాండ్‌లో చరిత్ర సృష్టించారు. ఆ దేశ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా గోసల్ చరిత్రాకెక్కారు. వెస్ట్ స్కాట్లాండ్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరఫున గెలిచిన గోసల్.. మెంబర్ ఆఫ్ ది స్కాటిష్ పార్లమెంట్‌గా(ఎంఎస్‌పీ) ఎన్నికయ్యారు. "భారతీయ మూలాలు గల ఓ మహిళ స్కాటిష్ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. చాలా ఆనందంగా ఉంది. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ. వెస్ట్ స్కాట్లాండ్ ప్రజలకు సేవా చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను." అని గోసల్ ట్వీట్ చేశారు. ఇక గ్లాస్గోలో పుట్టిన గోసల్ తన జీవితకాలంలో ఎక్కువగా స్కాట్లాండ్‌లోనే గడిపారు.


2019 జనరల్ ఎన్నికల్లో తొలిసారి ఈస్ట్ డన్‌బార్టన్‌షైర్ నుంచి స్కాటిష్ కన్జర్వేటివ్ అండ్ యూనియన్ పార్టీ తరఫున పార్లమెంటరీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెకు స్కాట్లాండ్, యూకే రెండు దేశాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద రంగాలలో ఆర్థికాభివృద్ధి, అంతర్గత పెట్టుబడి, వ్యాపారం, సాంస్కృతిక, చట్టపరమైన మరియు నియంత్రణ విధానాలపై పనిచేసిన 30 సంవత్సరాల అనుభవం ఉంది. గోసల్‌ కన్స్యూమర్ లా‌లో ఎంబీఏ పట్టా పొందారు. ఆమెకు 2015లో ఉమెన్ లీడర్ బిజినెస్ అవార్డు, 2018లో పబ్లిక్ సర్వీస్ అవార్డు దక్కాయి. ప్రస్తుతం ఆమె కన్జర్వేటివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (సీడబ్ల్యూఓ) డిప్యూటీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. అలాగే కన్జర్వేటివ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా స్కాట్లాండ్ (సీఎఫ్ఐఎస్) డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. 

Updated Date - 2021-05-11T17:20:38+05:30 IST