రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి
ABN , First Publish Date - 2022-05-23T22:33:34+05:30 IST
కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి. ఉపాధి హామీ నిధులలో కోత విధించకుండా, గత ట్రాక్ రికార్డు ఆధారంగా, ఇప్పుడు జరుగుతున్న పనులను చూసి రాష్ట్రానికి కనీసం 16 కోట్ల పనిదినాలను ఆమోదించాలి.
హైదరాబాద్: కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి. ఉపాధి హామీ నిధులలో కోత విధించకుండా, గత ట్రాక్ రికార్డు ఆధారంగా, ఇప్పుడు జరుగుతున్న పనులను చూసి రాష్ట్రానికి కనీసం 16 కోట్ల పనిదినాలను ఆమోదించాలి. అలాగే ప్రజోపయోగ పనులు చేస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రోత్సహించాలని ఉపాధి హామీ కౌన్సిల్ తీర్మానించింది. అలాగే, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానించాలని. అర్బన్ ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ చేసుకునే వీలు కల్పించాలని తీర్మానంలోపేర్కొన్నారు. గతంలో లాగే, ఎస్సీ, ఎస్టీలకు సెపరేట్ గా పేమెంట్స్ ఇవ్వాలి. పని జరిగే ప్రాంతాల్లో ఫోటోలు తీయడం, పంపడం వంటి ఇబ్బందికర చర్యలను వెనక్కి తీసుకోవాలని కోరింది.
ఇప్పటికే బకాయిలుగా ఉన్న 97 కోట్ల 35లక్షల రూపాయలను వెంటనే చెల్లించాలి. అని ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao) అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి(indra karan reddy), సత్యవతి రాథోడ్(satyavati rathore), మల్లారెడ్డి(malla reddy), ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశం అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.ఉపాధిహామీ నిధుల వినియోగంలో దేశంలో మనమే నెంబర్ వన్ గా ఉన్నాం. అత్యధికంగా కూలీలకు పని దినాలు కల్పిస్తున్న రాష్ట్రం కూడా మన తెలంగాణేనని అన్నారు. తెలంగాణలో అడిగిన వారందరికి కొత్త జాబ్ కార్డులు ఇస్తున్నాం. కూలీలు కూడా ఉపాధి కోసం డిమాండ్ చేస్తున్నారు.
కరోనా కష్ట కాలం తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పల్లె ప్రగతి కార్యక్రమాల వల్ల ప్రజలు పట్టణాల నుంచి పల్లెలకు వాపస్ వలస పోతున్నారని మంత్రులు చెప్పారు.గత ప్రభుత్వాల కాలంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయవద్దు అనే క్లారిటి ఉండేది కాదు. తెలంగాణకు ముందు అవసరం లేని పనులు, ఉపయోగంలో లేని వాటికి ఉపాధిహామీ పనులు చేసిన సందర్భాలు ఉండేవి. తెలంగాణ వచ్చిన తరువాత ప్రజలకు అవసరమయ్యే పనులకు ఉపాధిహామీ నిధులను, కూలీలను ఉపయోగిస్తున్నాం. నర్సరీలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, రైతు కళ్లాలు, సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు వంటి పనులకు ఉపాధిహామీని ఉపయోగిస్తున్నామని మంత్రులు చెప్పారు.