లేఅవుట్లకు పంచాయతీ అనుమతి తప్పనిసరి
ABN , First Publish Date - 2020-12-04T04:51:59+05:30 IST
గ్రామాల్లో వేసే లేఅవుట్లకు పంచాయతీ అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎంపీడీవో పి.సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
కవిటి: గ్రామాల్లో వేసే లేఅవుట్లకు పంచాయతీ అనుమతులు తప్పనిసరిగా పొందాలని ఎంపీడీవో పి.సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆంధ్రజ్యోతిలో బుధవారం తోటలు కూల్చేయ్.. ప్లాట్లు వేసేయ్ శీర్షికతో ప్రచురితమైన కథనానికి స్పందించి కవిటి ఈవో జి.వెంకటరావుతో మాట్లాడారు. పంచాయతీ అనుమతి లేకుండా ఎన్ని లేఅవుట్లు ఉన్నాయో అన్న అంశంపై సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈమేరకు గురువారం కవిటి పంచాయతీ పరిధిలోని ప్రగడపుట్టుగలో లేఅవుట్ను ఈవో వెంకటరావు పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లేఅవుట్లకు నోటీసులు పంపిస్తామని, నిబంధనలకు లోబడి ఉన్న వాటి అనుమతులకు జిల్లా టౌన్ ప్లానింగ్ అధికారికి నివేదికలు పంపిస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసిన అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.