పంచాయతీ ట్రాక్టర్‌ బోల్తా

ABN , First Publish Date - 2020-11-25T04:45:32+05:30 IST

గ్రామ చెత్తసేకరించే క్రమంలో ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు పారిశుధ్య కార్మికులు మృతిచెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం పంచాయతీలో మంగళవారం జరిగింది. ఈ ప్రమాదం రెండు పేద కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది.

పంచాయతీ ట్రాక్టర్‌ బోల్తా
వరిపొలంలో బోల్తాపడిన ట్రాక్టర్‌

ఇద్దరు పారిశుధ్య కార్మికుల మృతి 

గుండాల మండలం ముత్తాపురంలో ఘటన

పేద కుటుంబాల్లో విషాదం నింపిన ప్రమాదం

గుండాల, నవంబరు 24: గ్రామ చెత్తసేకరించే క్రమంలో ట్రాక్టర్‌ బోల్తా పడి ఇద్దరు పారిశుధ్య కార్మికులు మృతిచెందిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం పంచాయతీలో మంగళవారం జరిగింది. ఈ ప్రమాదం రెండు పేద కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ముత్తాపురం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో చెత్త సేకరించేందుకు కార్మికులు రోజూల లాగే ట్రాక్టర్‌పై వెళ్లారు. ఆయా గ్రామాల్లో చెత్తసేకరిస్తూ వెళుతున్న క్రమంలో ముత్తాపురం వద్ద మలుపు తిరిగే సమయంలో అదుపు తప్పిన ట్రాక్టర్‌ వరి పొలాల్లోకి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో అందులో ఉన్న కార్మికులు పూనెం వసంతరావు (25) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన పూనె బుచ్చయ్య (62)ను ఇల్లెందు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. వెంటనే ఎంపీపీ ముక్తి సత్యం, ఎంపీడీవో గంటా వెంకట్రావు, ఈవోఆర్‌డీ వలీ  ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. గుండాల ఎస్‌ఐ ముత్యం రమేష్‌ పంచనామ నిర్వహించి, కేసు నమోదు చేశారు. అయితే రెక్కల కష్టంతో తమను సాకుతున్న తమ వారు ట్రాక్టర్‌ ప్రమాదంలో మృతిచెందడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. 


మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కలెక్టర్‌ 


పంచాయతీ ట్రాక్టర్‌ పల్టీ కొట్టిన సంఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. సంఘటన వివరాలను ఎంపీడీవో ద్వారా తెలుసుకున్న కలెక్టర్‌ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎంపీడీవో, ఇతర అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-11-25T04:45:32+05:30 IST