రోజా చెప్పిన జగన్ గన్ను కాదు.. అట్ట తుపాకీ: అనురాధ

ABN , First Publish Date - 2022-04-29T18:35:43+05:30 IST

ఆడబిడ్డల రక్షణను గాలికొదిలేసి వైసీపీ మహిళా మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని...

రోజా చెప్పిన జగన్ గన్ను కాదు.. అట్ట తుపాకీ: అనురాధ

విజయవాడ: రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణను గాలికొదిలేసి వైసీపీ మహిళా మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  చీరలు, నగలు గురించి తప్ప ఇంకేం మాట్లాడ్డం రాదా గుడ్డి రోజాకు? అంటూ దుయ్యబట్టారు. కిరాతకుల చేతిలో బలైపోయిన బాధితులకు చీర కప్పి అండగా నిలుస్తామని చెప్పాల్సింది పోయి వారికి న్యాయం చేయమని అడిగిన చంద్రబాబుకు చీరలు పంపిస్తానంటారా? రోజా చెప్పిన జగన్ గన్ను కాదు.. అట్ట తుపాకీ అంటూ ఎద్దేవా చేశారు. మహిళలకు రక్షణ కల్పించడం చేతకాని వైసీపీ నేతలు సిగ్గులేకుండా తమపై విమర్శలు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. లోకేష్ పర్యటనను అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్యగా అనురాధ అభివర్ణించారు. 


అత్యాచారం ఏ రోజు ఎక్కడ జరిగిందో కూడా రాష్ట్ర హోంమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటని పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిలో ఒక్కరినైనా శిక్షించారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార దుస్థితిపై వైద్యశాఖ మంత్రి విడదల రజనీ ఒక్క సమీక్ష చేశారా? అని నిలదీశారు. కుయ్ కుయ్ మనే అంబులెన్స్‌కు, వైసీపీ మంత్రుల కార్లకు పెద్ద తేడా లేదన్నారు. వైసీపీ జేబు సంస్థగా పనిచేస్తున్న ఏపీ మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వ్యవహరించిన తీరు సరిగాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలు నేరస్థులను ప్రోత్సహించేలా ఉన్నాయి కాబట్టే వారలా పేట్రేగిపోతున్నారని పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-04-29T18:35:43+05:30 IST