టెస్టుల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ.. కపిల్ రికార్డును చెరిపేసిన పంత్

ABN , First Publish Date - 2022-03-14T00:09:27+05:30 IST

శ్రీలంకతో ఇక్కడి ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్

టెస్టుల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ.. కపిల్ రికార్డును చెరిపేసిన పంత్

బెంగళూరు: శ్రీలంకతో ఇక్కడి ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న డే/నైట్ టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అరుదైన రికార్డు సృష్టించాడు. శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌట్ చేసిన అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే కొంత పరవాలేదనిపించింది.


హనుమ విహారి (35) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తాము చూస్తున్నది టెస్టా? టీ20 మ్యాచా? అన్నది ప్రేక్షకులకు కాసేపు అర్థం కాలేదు. వచ్చీ రావడమే బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 28 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు పిండుకున్నాడు. ఫలితంగా 1982లో కరాచీలో పాకిస్థాన్‌పై మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ నెలకొల్పిన  రికార్డు బద్దలైంది. ఆ మ్యాచ్‌లో కపిల్ 30 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించగా, పంత్ 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు.


ఇక ఇండియాలో టెస్టుల్లో నమోదైన వేగవంతమైన అర్ధ సెంచరీల రికార్డుల విషయానికి వస్తే 2005లో భారత్‌తో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 1981లో ఇయాన్ బోథమ్ ఇండియాపై 28 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకోగా, తాజాగా రిషబ్ పంత్ బెంగళూరులో అన్నే బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. 1986లో అర్జున రణతుంగ ఇండియాపై 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 


అత్యంత వేగంగా అర్ధ  సెంచరీలు నమోదు చేసిన భారత ఆటగాళ్లలో ఇప్పుడు రిషభ్ పంత్ మొదటి స్థానాన్ని ఆక్రమించగా, కపిల్‌దేవ్ రెండో స్థానంలో ఉన్నాడు. 1982లో కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో ఆ ఘనత సాధించాడు. 2021లో ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ 31 బంతుల్లో, 2008లో చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్ 32 బంతుల్లో ఆ ఘనత సాధించారు. 

Updated Date - 2022-03-14T00:09:27+05:30 IST