పంట లెక్క! .. ఇక పక్కా..

ABN , First Publish Date - 2022-10-07T04:44:33+05:30 IST

ఈ-పంట నమోదు ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. వెబ్‌ల్యాండ్‌ డేటా ఆధారంగా రైతులు ఏ సర్వే నెంబరులో ఏ పంట వేశారో సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేశారు.

పంట లెక్క! .. ఇక పక్కా..
ఈ-పంట నమోదు చేస్తున్న వీఏఎలు (ఫైల్‌)

ఈ పంట నమోదు పూర్తి

ఈకేవైసీకి కసరత్తు చేస్తున్న వ్యవసాయశాఖ


నెల్లూరు (వ్యవసాయం), అక్టోబరు 6 : ఈ-పంట నమోదు ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యింది. వెబ్‌ల్యాండ్‌ డేటా ఆధారంగా రైతులు ఏ సర్వే నెంబరులో ఏ పంట వేశారో సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేశారు. రైతుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు, తెగుళ్ల నష్టం, అతివృష్టి, అనావృష్టి వల్ల వాటిల్లితే పంటల బీమా పథకంలో పరిహారం పొందేందుకు ఈ-పంట నమోదు తప్పనిసరి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వీఏఏలు ఈ-పంట నమోదు చేశారు. వీఆర్వోలతోపాటు ఎంఏవోలు, తహసీల్దార్లు ఈ-పంట వివరాలను ధ్రువీకరించాలి. జిల్లాలో 1.84లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణంలో 1,82,189 ఎకరాలకు ఈ-క్రాప్‌ నమోదు (99శాతం) పూర్తయింది.


అధికారులే బాధ్యులు


గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) నమోదు చేసిన వివరాలను గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) పరిశీలించుకుని రైతు నుంచి సంతకం తీసుకోవడం వల్ల పూర్తిస్థాయిలో పారదర్శకతకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్‌ సమస్యలతో రాత్రిళ్లు సైతం వీఏఏలు, వీఆర్వోలు పని చేశారు. గతంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాలకు వెళ్లకుండానే ఈ-పంట నమోదు చేసేవారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరొకొన్ని చోట్ల దళారులతో కుమ్మక్కై పంటలేని చోట కూడా పంట ఉన్నట్లు నమోదు చేశారు. ఈసారి వీఆర్వో ధ్రువీకరణతో రైతుకు డిజిటల్‌ రశీదు ఇవ్వనున్నారు. రైతు సంతకం సైతం తీసుకోవడం వల్ల తప్పుడు లెక్కలకు కాలం చెల్లినట్లయింది. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారి బాధ్యుడిగా చేసందుకు వీలుంది. పంట సాధారణ విస్తీర్ణం వేసి పంట గణాంకాలు సాధారణంగా ఊహా జనితంగానే ఉండేవి. ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్పష్టత రావడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు ఎదురైతే ఏ పంట ఎంతమేరకు దెబ్బతిన్నదో అంచనా వేసే వీలుంటుంది. దీంతో పరిహారం చెల్లింపులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. 


పక్కాగా వివరాల సేకరణ

- సుధాకర్‌రాజు, జిల్లా వ్యవసాయాధికారి

వీఏఏలు, వీఆర్వోలు పక్కాగా ఈ-పంట నమోదు చేయడం వల్ల పారదర్శకత ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సనంక్షేమ పథకాలు ఈ-పంట నమోదుపై ఆధారపడి ఉంటుంది. డిజిటల్‌ రశీదు రైతులకు ఇవ్వడం వల్ల వేసిన పంట సరిగా నమోదు చేశారా అని చూసుకోవచ్చు. అయితే సాంకేతిక సమస్యల కారణంగా వీఏఏ, వీఆర్వోల ధ్రువీకరణలో జాప్యం జరుగుతోంది. వీఏఏల లాగిన్లలో 1,77,322 ఎకరాలు, వీఆర్వోలు 1,48,419 ఎకరాల్లో ఽధ్రువీకరణ పూర్తయింది. 17,318 ఎకరాలకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తయింది. మరో రెండు మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుంది.

Updated Date - 2022-10-07T04:44:33+05:30 IST