అన్నదాతకు గుండె కోత
ABN , First Publish Date - 2020-12-03T04:33:54+05:30 IST
సార్వా నాశనమైంది.. నివర్ తుఫాన్ రైతు లను కోలుకోలేని దెబ్బ తీసింది.
నిండా ముంచిన నివర్
మాసూళ్లపై మీమాంస
తణుకు, డిసెంబరు 2 : సార్వా నాశనమైంది.. నివర్ తుఫాన్ రైతు లను కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా దిగుబడుల్లేక తలలు పట్టుకుని కూర్చున్న రైతులను నివర్ నిండా ముంచేసింది. గత ఖరీఫ్ సీజన్తో పోల్చితే 70 శాతం మేర దిగుబడి తగ్గిపోయినట్టు రైతులు వాపోతున్నారు.ఈ ఏడాది ఆరంభంలో వాతావరణం సాగుకు అనుకూలంగా ఉండడంతో తగినంతగా పెట్టుబడులు పెట్టారు. అయితే రాను రాను ప్రకృతి అన్నదాతపై ప్రకోపం చూపింది.. ఎడతెరిపి లేని వానలతో పంటను నాశనం చేసింది. వాతావరణంలో వచ్చిన మార్పులు రావడంతో ఈనిక దశకు వచ్చిన చేలు నేలవారాయి. చీడపీడలు కూడా చుట్టుముట్టాయి.. ఆ కష్టం నుంచి గట్టెక్కి ఏదో వచ్చిన పంటను కోసుకుందామనుకునే సరికి నివర్ రూపంలో మరో కష్టం వచ్చిపడింది. కొంతమంది రైతులకు చివరలో కోత కోయడానికి కూడా సరిపడా ధాన్యం రాని పరిస్థితులు ఉన్నాయి. గతేడాది ఇదే సీజన్లో ఎకరాకు 35 నుంచి 45 బస్తాల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 15 నుంచి 25 బస్తాలు మాత్రమే దిగుబడి రావడంతో అన్నదాతకు కష్టమే మిగిలింది. ఎకరాకు సుమారుగా రూ. 40 వేల మేర పెట్టుబడులు పెట్టి నట్టు రైతులు చెబుతున్నారు. అన్నదాతపై ఇంత కష్టం వచ్చిపడినా ప్రభుత్వం ఇప్పటి వరకూ పంట నష్టానికి సంబంధించిన లెక్కలు తీసిన సందర్భాల్లేవు. దీంతో అసలు ప్రభుత్వం నుంచి సాయం అందు తుందా లేదా అనే విషయంలో కూడా రైతులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతా ంగం కోరుతున్నారు.