పంటకాల్వ రోడ్డు పనులు పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-11-29T06:27:25+05:30 IST
పంటకాల్వ రోడ్డు పనులు పూర్తిచేయాలి
నిలిచిపోయిన వంతెన నిర్మాణం వద్ద టీడీపీ నేతల నిరసన
పెనమలూరు, నవంబరు 28 : సనత్నగర్ నుంచి పోరంకి వైపునకు పంటకాల్వ రోడ్డు మూడవ దశ నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం వీఆర్ సిద్ధార్థ కళాశాల వద్ద నిలిచిపోయిన వంతెన నిర్మాణం వద్ద నిరసన చేపట్టారు. కేసీపీ కాలనీ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఉన్న వంతెనపై పాదయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సం దర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మె ల్యే పార్థసారథి ఇటీవల సిద్ధార్థ కళాశాలలో జరిగిన తన కుమారుడి వివాహానికి వచ్చే అతిథుల కోసం వంతెనను వాడుకుని ప్రజలకు మాత్రం వినియోగం లోకి తీసుకురావడంలేదన్నారు. సుమారు 2013లో ప్రస్తుత ఎమ్మెల్యే సారథి మంత్రిగా ఉన్నప్పుడు పంట కాల్వ రోడ్డుకు శంకుస్థాపన చేసి వదిలేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిధులు మంజూరు చేయించి సనత్నగర్ నుంచి తాడిగడప వందడుగుల రోడ్డు వరకు రహదారిని నిర్మించామన్నారు. వీఆర్ సిద్థార్థ కళాశాల వద్ద ఉన్న వంతెన నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యే నాటికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. రెండున్నరేళ్లలో ఒక్క శాతం పనులు కూడా జరపక పోవడం బాధాకరమన్నారు. నియోజకవర్గంలో అనేక పనులు నిలిచిపోయాయన్నారు. వాటిని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెలగపూడి శంకరబాబు, అను మోలు ప్రభాకరరావు, కుర్రా నరేంద్ర, మారుపూడి ధనకోటేశ్వరరావు, కోయ ఆనంద్ ప్రసాద్, షేక్ బుజ్జి, దోనేపూడి రవి కిరణ్, బొర్రా కృష్ణ, యార్లగడ్డ సుచిత్ర, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.