నేడు పరిషత్ సమరం
ABN , First Publish Date - 2021-11-16T06:53:00+05:30 IST
జిల్లాలో పలు కారణాలతో ఎన్నికలు జరగకుండా నిలిచిపోయిన మూడు జడ్పీటీసీ, ఏడు ఎంపీటీసీలకు మంగళవారం పోలింగ్ జరగనుంది.
3 జడ్పీటీసీ, 7 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
179 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
ఓటర్లు 1,23,865 మంది
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం) : జిల్లాలో పలు కారణాలతో ఎన్నికలు జరగకుండా నిలిచిపోయిన మూడు జడ్పీటీసీ, ఏడు ఎంపీటీసీలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు, పెడన నియోజకవర్గంలోని పెడన, తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట జడ్పీటీసీలకు, ముదినేపల్లి మండలంలోని పర్రచివర, ముదినేపల్లి-2, వణుదుర్రు, గన్నవరం మండలంలోని చినఅవుటపల్లి, పెనుగంచిప్రోలు మండలంలోని కొణకంచి, నూజివీడు మండలంలోని దేవరగుంట, ఆగిరిపల్లి మండలంలోని ఈదర-1 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మొత్తం సెగ్మెంట్లలో 179 పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాటు చేసింది.
జడ్పీటీసీ స్థానాల్లో 1.23 లక్షల మంది ఓటర్లు
జిల్లాలో మంగళవారం జరగనున్న మూడు జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 1,23,865 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జి.కొండూరు జడ్పీటీసీలో 48,377 మంది, పెడనలో 28,052 మంది, విస్సన్నపేటలో 47,436 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు : కలెక్టర్
జిల్లాలో మంగళవారం జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ నివాస్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాకు ఈ మేరకు బులెటిన్ను విడుదల చేశారు. 33 సమస్యాత్మక, 49 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 883 పెద్ద బ్యాలెట్ బాక్సులు, 16 మీడియం, 523 చిన్న బ్యాలెట్ బాక్సులను ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. ఏడుగురు రిటర్నింగ్ అధికారులు, తొమ్మిది మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 13 మంది జోనల్ అధికారులు, 22 మంది రూట్ ఆఫీసర్లు, 204 మంది పోలింగ్ ఆఫీసర్లు, 204 మంది ఏపీవోలతో పాటు 720 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించినట్టు చెప్పారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు 107 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని, పోలింగ్ అనంతరం కౌంటింగ్ జరుగుతుందని పేర్కొన్నారు.