పార్కులు ఆహ్లాదభరితంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-03-06T05:37:33+05:30 IST
పార్కులు ఆహ్లాదభరితంగా ఉండాలి
- మంచి వాతావరణంతో రోగాలు దూరం
- పరిగిలో ఓపెన్జిమ్ ఏర్పాటుకు చర్యలు
- వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు
పరిగి: పార్కులు, ఆటస్థలాలు ఆహ్లాదభరితంగా ఉండాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు అన్నారు. పరిగి మునిసిపల్ పరిధిలోని మల్లెమోనిగూడ శివారులోని నర్సరీ, హౌజింగ్బోర్డు, మైత్రీనగర్లలోని పార్కులను గురువారం పరిశీలించారు. పరిగి అస్పత్రి, కోవిడ్ సెంటర్లను సందర్శించారు. అనంతరం ఇండోర్స్టేడియంలో వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇండోర్స్టేడియం అబ్బురపడేవిధంగా ఉందని ప్రశసించారు. కాసేపు సరదాగా షటిల్ ఆడారు. ఇండోర్ స్టేడియంలోని కిందిభాగంలో చినిగిపోయిన కార్పెట్లను మార్చాలని సూచించారు. నీటివసతి, లైట్లను ఏర్పాటుచేయాలని, వాటర్లీకేజీ లేకుండా మరమ్మతులు చేపట్టాలని సూచించారు. మునిసిపల్ పరిధిలోని పట్టణ ప్రకృతివనాలు బాగున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. పరిగి మునిసిపల్ పరిధిలో పురుషులు, మహిళలకు వచ్చే ఆర్థిక ఏడాది ఓపెన్ జిమ్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్కుల్లో వాకింగ్ ట్రాక్, బెంచీలు ఏర్పాటు చేసి, మెరిసేవిధంగా రంగులు వేయించాలని సూచించారు. అవసరం మేరకు హరితహారం మొక్కలు అందజేయాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లలో నాటిన విత్తనాలు మొలకెత్తేవిధంగా చూడాలన్నారు. ఇండోర్స్టేడియం అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. పరిగి పట్టణంలో సమీకృత కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా యువజన సంక్షేమ అధికారి హన్మంత్రావు, మునిసిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్, సత్యనారాయణషీండే, గౌస్మోహినోద్దీన్లు ఉన్నారు.
కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించిన కలెక్టర్
పరిగి: పరిగిలో సీహెచ్సీలోని కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను గురువారం జిల్లా కలెక్టర్ పౌసుమిబసు సందర్శించారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారితో మాటాడారు. ఎలాంటి సమస్యలు లేవని డాక్టర్ షిండే వివరించారు. వ్యాక్సిన్ కోసం 39మంది రిజిస్ర్టేషన్ చేసుకోగా, 19 మందికి వాక్సినేషన్ చేశారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
కొడంగల్/వికారాబాద్/బషీరాబాద్/ తాండూరు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి రాజేశ్వర్, నాయకులు నరహరివశిష్ట, పునంచంద్ లావోటి కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎమ్మెల్యే నరేందర్రెడ్డి ఆసుపత్రిని సందర్శించి వారికి దైర్యం చెప్పారు. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చైర్పర్సన్ మంజుల రమేష్ దంపతులు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. బషీరాబాద్ పీహెచ్సీలో మండల స్థాయి ఆసుపత్రి డెవల్పమెంట్ కమిటీ సమావేశం ఎంపీపీ కరుణఅజయ్ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రియాంక, రేఖపవాన్ఠాగూర్, స్వామినాథ్, ఎస్ఐ విద్యాచరణ్రెడ్డి పాల్గొన్నారు. తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ జనసమితి తాండూరు ఇన్చార్జి, మున్సిపల్ ఫ్లోర్లీడర్ సోంశేఖర్ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.