ప్రభుత్వ ధనంతో పార్టీ ప్రచారమా?: బుడ్డా
ABN , First Publish Date - 2022-06-25T05:51:07+05:30 IST
ప్రభుత్వ ధనంతో గడపగడపకు మన ప్రభుత్వం పేరిట వైసీపీ తమ పార్టీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మండిపడ్డారు.
ఆత్మకూరు, జూన్ 24: ప్రభుత్వ ధనంతో గడపగడపకు మన ప్రభుత్వం పేరిట వైసీపీ తమ పార్టీ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మండిపడ్డారు. ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజాసమస్యలను తెలుసుకోవాల్సిన వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం ఎంపిక చేసిన వైసీపీ నేతల ఇళ్ల వద్దకే వెళ్లి సొల్లుకబుర్లు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఎవరైనా సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తే ఆ పార్టీ నాయకులు పరోక్షంగా బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన స్వగ్రామమైన వేల్పనూరులో కూడా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తనను వెంట పెట్టుకుని తమ ప్రభుత్వంలో ప్రజలకు చేకూర్చిన లబ్ధిని వివరిస్తానని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన స్వగ్రామంలోనే కాకుండా శ్రీశైల నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే శిల్పా వెంట గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, షెడ్యూల్ ఖరారు చేయాలని ఎమ్మెల్యే శిల్పాకు సవాల్ విసిరారు. దుల్హన్ పథకాన్ని నిలిపివేయడం దారుణమన్నారు. మాజీ సర్పంచ్ కంచర్ల గోవిందరెడ్డి, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ తిరుపమయ్య, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు కలీముల్లా, నాయకులు మోమిన్ ముస్తఫా, శివప్రసాద్రెడ్డి, అబ్దుల్లాపురం బాషా, అలిహుసేన్ ఉన్నారు.