కాసుల పంట
ABN , First Publish Date - 2022-08-12T05:45:49+05:30 IST
ఎన్నో ఏళ్లుగా భూమినే నమ్ముకుని సాగు చేస్తు న్న రైతులకు డాక్యుమెంట్ మినహా పాస్ పుస్తకాలు లేవు. ఆన్లైన్లో తమ పేర్లు కనిపించవు.
పాస్ పుస్తకాల జారీకి రూ.1.24 కోట్లు
చక్రదేవరపల్లిలో 600 ఎకరాలకు జారీ
ఒక్కో ఎకరానికి రూ.21,500 వసూలు
జంగారెడ్డిగూడెం, ఆగస్టు 11 : ఎన్నో ఏళ్లుగా భూమినే నమ్ముకుని సాగు చేస్తు న్న రైతులకు డాక్యుమెంట్ మినహా పాస్ పుస్తకాలు లేవు. ఆన్లైన్లో తమ పేర్లు కనిపించవు. వీటిపై బ్యాంకు రుణాలు పొం దలేక, తమ పిల్లలకు కట్న కానుకలుగా ఇవ్వలేక, ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉంటున్న ఆ రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అన్ని అడ్డంకులను అధిగ మించి ఆయా భూములకు పాస్ పుస్తకాలు, ఆన్లైన్లో నమోదు వంటి ప్రక్రియకు తెరలేచింది. ఇంత కష్టపడుతున్న అధికారులకు రైతులు ఎంతో ఆనందంగా ఎకరానికి రూ.21,500 చొప్పున రూ.కోటీ 24 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారట..! ఇలా వచ్చిన మొ త్తాన్ని వాటాలు వేసుకుని పంచుకుంటారట ! జంగారెడ్డిగూడెం మండలంలో ఇదే విష యం హాట్ టాఫిక్గా మారింది. ఏ నలుగురు కలిసిన ‘అధికారులు కష్టపడుతున్నారుగా! ఆ మాత్రం ఇవ్వాలి..! వారికి ఖర్చులు ఉంటాయిగా..! ఏదైనా అధికారులు మాత్రం జాక్ పాట్ కొట్టేశారు’ అంటూ జోకులు వేసుకుంటున్నారు.
జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లిలో ఎప్పటి నుంచో ఒక వివాదం నెలకొంది. జమీందారు పొలాలు 900 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడున్న చిన్న, సన్నకారు రైతుల నుంచి, బడా రైతుల వరకు ఈ భూములను తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుం టూ జీవనం సాగిస్తున్నారు. కానీ ఈ భూములకు పాస్ పుస్తకాలు లేవు. ఆన్లైన్ అవ్వలేదు. భూమి ఒకరి దగ్గర ఉంటే ఆన్లైన్లో వేరే ఊరు ఉండటం కారణంగా ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా సాగుపైనే ఆధారపడి ఉన్నప్పటికీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఏ పధకం వర్తించడం లేదు. క్రయ విక్రయాలకు చాన్సే లేదు. ఇక ఆడపిల్లలకు పసుపు, కుంకుమ కింద భూమి ఇవ్వడమే తప్ప వాటికి ఎటువంటి ఆధారం లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి. ఈ విషయాన్ని స్థానిక రైతులు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన జిల్లా కలెక్ట ర్తో మాట్లాడి ఈ భూములకు పట్టాలు కల్పించే దిశగా చర్యలు తీసుకున్నారు. దీంతో వెంటనే ఇక్కడ పాస్ పుస్తకాల పనులు మొదలయ్యాయి. ఎప్పటి నుంచో రైతులు ఎదు రుచూస్తున్న పాస్ పుస్తకాలు వచ్చి తమ పేర్లపై ఆన్లైన్ అయ్యే సమయం ఆసన్న మైంది. రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. దీనినే అధికారులు క్యాష్ చేసుకున్నట్టు సమాచారం. ఒక్కో ఎకరానికి రూ.21,500 వరకు రైతులు రెవెన్యూ అధికారులకు అప్పగించినట్టు సమాచారం. ఇలా వచ్చిన రూ.21,500 సొమ్ములో ఒకరూ ఇద్దరు కాదు.. చాలా మందికే వాటాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. 600 ఎకరాలకు పాస్ పుస్తకాలు ఇవ్వగా.. మరో 300 ఎకరాలకు పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. వీటికి ఇదే రేటు కడతారో..! మరింత పెంచుతారో..? చూడాలి..! ఇదే మెట్ట ప్రాంతంలో ఇప్పుడు ఇదే హాట్టాపిక్.