ప్రయాణికులపై భారం తగదు
ABN , First Publish Date - 2022-07-03T06:37:44+05:30 IST
ప్రయాణికులపై భారం మోపడం తగదని టీడీపీ నాయకులు అన్నారు.
ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం దారుణం
పెంచిన చార్జీలను రద్దు చేయాలి
టీడీపీ నాయకుల ధర్నా
ప్రయాణికులపై భారం మోపడం తగదని టీడీపీ నాయకులు అన్నారు. ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం జిల్లా వ్యాప్తంగా ధర్నాలు... ర్యాలీలు చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ బస్సు చార్జీలు పెంచడం దారుణమని, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లలో మూడుసార్లు చార్జీలు పెంచడంతో ప్రజలు బస్సుల్లో ప్రయాణించడానికే భయపడుతున్నారన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు అసహనంతో ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. పల్లె వెలుగు బస్సులో ఎక్కి చార్జీల పెంపుపై ప్రయాణికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలంటూ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె బస్టాండ్లో ధర్నా చేశారు. డోన్ పట్టణంలోని బస్టాండ్ ఎదుట నాయకులు రోడ్డుపై బైఠాయించారు. శిరివెళ్లలో ర్యాలీ చేశారు. నందికొట్కూరు బస్టాండ్ సెంటర్లో... గడివేముల బస్టాండ్ వద్ద నాయకులు నిరసన తెలియజేశారు.
-నంద్యాల, (ఆంధ్రజ్యోతి)
బనగానపల్లె, జూలై 2: ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా బనగానపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పార్టీ శ్రేణులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ధర్నా చేశారు. సీఎం డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం బీసీ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో పెంచని విధంగా ఏపీ ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచిందన్నారు. చివరకు విద్యార్థుల బస్సు పాస్ చార్జీలను పెంచడం దారుణమన్నారు. గతంలో తమ ఐదేళ్ల పాలనలో ఏనాడూ చార్జీలు పెంచలేదని గుర్తుచేశారు. బస్సు చార్జీలు పెంచడంతో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బస్సు చార్జీలు పెంచడంపై బీసీ జనార్దన్రెడ్డి ప్రయాణికులకు అవగాహన కల్పించారు. టీడీపీ నాయకులు జాహిద్ హుస్సేన్, బొబ్బల గోపాల్రెడ్డి, సర్పంచ్ మహేశ్వరరెడ్డి, పట్టణ ఉప సర్పంచ్ బురానుద్దీన్, అల్తాప్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
నంద్యాల (కల్చరల్): ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని, లేకపోతే టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండు వద్ద శనివారం ధర్నా చేపట్టారు. ఒక చేత్తో సంక్షేమ పథకాలు ఇచ్చి మరో చేత్తో ప్రజల నుంచి వివిధ రూపాలలో డబ్బులను లాగేస్తున్నారని మండి పడ్డారు. ఒక్కచాన్సు పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రంలో అన్ని వర్గాలను సర్వనాశనం చేశారని విమర్శించారు. నిత్యావసర ధరలతో పాటు అన్ని వస్తువులపై రేట్లు పెంచేసి దండుకుంటున్నారన్నారు.