Pilot fainted: 30 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం.. పైలట్‌ అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో..

ABN , First Publish Date - 2022-08-27T22:09:38+05:30 IST

ఇటీవల బ్రిటన్(Britain) నుంచి టర్కీకి(Turkey) బయలుదేరిన ఓ విమానంలో పైలట్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారన్న వార్త కలకలం రేపింది.

Pilot fainted: 30 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం.. పైలట్‌ అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో..

ఎన్నారై డెస్క్: ఇటీవల బ్రిటన్(Britain) నుంచి టర్కీకి(Turkey) బయలుదేరిన ఓ విమానంలో పైలట్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారన్న వార్త కలకలం రేపింది. అసలేం జరుగుతోందో అర్థంకాక ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో.. కోపైలట్ విమానాన్ని అత్యవసరంగా గ్రీస్‌లో దింపేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బ్రిటన్‌కు చెందిన జెట్2(Jet2) విమానయాన సంస్థ ఫ్లైట్‌లో మంగళవారం ఈ ఘటన వెలుగు చూసింది.  జెట్‌2(Jet2) సంస్థకు చెందిన విమానం బర్మింగ్‌హామ్(Birmingham) ఎయిర్‌పోర్టు నుంచి టర్కీలోని అంటాల్యా(Antalya) నగరానికి బయలుదేరింది. కొద్ది సేపటికి విమానం 30 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది.


ఇంతలో విమానంలో హడావుడి మొదలైంది. సిబ్బంది గాబరాపడుతున్న విషయాన్ని ప్రయాణికులు గమనించారు. ఆ తరువాత.. విమానం టాయిలెట్‌లో ఎవరో పడిపోయారన్న వార్త వారికి చేరింది. అంతకుమునుపే.. భారీ గాలుల కారణంగా విమానం కుదుపులకు లోనైంది. దీన్ని టర్బులెన్స్ అంటారు. దీంతో.. టర్బులెన్స్ కారణంగా ఎవరైనా పడిపోయి ఉంటారని ప్రయాణికులు భావించారు. అసలేం జరిగిందనే దానిపై స్పష్టత రాకమునుపే.. పైలట్ స్పృహ కోల్పోయారని సిబ్బంది చెప్పడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో.. కోపైలట్ విమానాన్ని గ్రీస్‌లో అత్యవసరంగా దించేస్తున్నట్టు చెప్పారు. చివరికి ఫ్లైట్ గ్రీస్‌లోని(Greece) Thessaloniki విమానాశ్రయంలో దిగింది. ఇక..అంబులెన్స్ వచ్చేందుకు మరో గంట ఆలస్యం కావడంతో పైలట్‌ను విమానంలోంచి దించే వరకూ ప్రయాణికులందరూ ఎవరి సీట్లో వారు కూర్చోవాల్సి వచ్చింది.


ఈ ఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో వేచి చూస్తున్న తమకు జెట్2 సంస్థ సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపించారు. ఈ ఘటనపై జెట్2 సంస్థ కూడా స్పందించింది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు చెప్పింది. ప్యాసెంజర్లకు వీలైనంత త్వరగానే అప్‌డేట్స్ ఇస్తూ వచ్చామని పేర్కొంది. మరో పైలట్‌ను ప్రత్యేక విమానంలో గ్రీస్‌కు రప్పించి.. ప్రయాణికులందరినీ టర్కీకి తరలించామని పేర్కొంది. అయితే.. ఈ ఘటన కారణంగా తమకు ఎనిమిది గంటల సమయం వృథా అయ్యిందని కొందరు ప్రయాణికులు తెలిపారు. దీని పరిహారంగా సంస్థ కేవలం 15 పౌండ్లు విలువచేసే ఆహార కూపన్లు ఇచ్చి సరిపెట్టిందని మండిపడ్డారు. 



Updated Date - 2022-08-27T22:09:38+05:30 IST