తహసీల్దార్ సస్పెన్షన్
ABN , First Publish Date - 2021-01-24T06:02:04+05:30 IST
భూ పట్టా మార్పిడీ విషయంలో పత్తికొండ ఇన్చార్జి తహసీల్దార్గా గతంలో పనిచేసిన శ్రీదేవితో పాటు వీఆర్వో జాకీర్, వీఆర్ఏలు ఫకృద్దీన్, అబ్దుల్రహిమాన్, కంప్యూటర్ ఆపరేటర్ సుధాకర్ను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు.
- వీఆర్వో, ఇద్దరు వీఆర్ఏలు, కంప్యూటర్ ఆపరేటర్ కూడా..
పత్తికొండ, జనవరి 23: భూ పట్టా మార్పిడీ విషయంలో పత్తికొండ ఇన్చార్జి తహసీల్దార్గా గతంలో పనిచేసిన శ్రీదేవితో పాటు వీఆర్వో జాకీర్, వీఆర్ఏలు ఫకృద్దీన్, అబ్దుల్రహిమాన్, కంప్యూటర్ ఆపరేటర్ సుధాకర్ను జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. పత్తికొండ డిప్యూటీ తహసీల్దార్గా గతంలో విధులు నిర్వహించిన శ్రీదేవి అప్పటి తహసీల్దార్ బదిలీపై వెళ్లడంతో ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన ఓ పట్టా పొలాన్ని వీఆర్వో జాకీర్, వీఆర్ఏలు ఫకృద్దీన్, అబ్దుల్ రెహమాన్, కంప్యూటర్ ఆపరేటర్ సుధాకర్ పేరిట మార్పు చేశారు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై జిల్లా అధికారులు ప్రత్యేక విచారణకు ఆదేశించారు. ముందస్తు చర్యలలో భాగంగా శ్రీదేవిని ఆలూరు పౌరసరఫరాల గోదాము ఇన్చార్జి (సీఎస్డీటీ)గా బదిలీ చేశారు. ఇందులో ప్రమేయం ఉన్న వీఆర్వో జాకీర్ను కూడా ఆలూరు ప్రాంతానికి బదిలీ చేశారు. విచారణలో నిజం తేలడంతో నలుగురిని సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు.