ఆదర్శ పాలనాదక్షులు PV Narasimha Rao: Pawan
ABN , First Publish Date - 2022-06-28T17:17:10+05:30 IST
ఆదర్శ పాలనాదక్షులు పీవీ నరసింహారావు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. నేడు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ..
Amaravathi : ఆదర్శ పాలనాదక్షులు పీవీ నరసింహారావు(PV Narasimha Rao) అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కొనియాడారు. నేడు పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ఓ ప్రకటనను పవన్ విడుదల చేశారు. ఆ ప్రకటనలో పవన్.. ‘‘కులాలను విడదీయలేదు. వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టలేదు. ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోయలేయలేదు. గద్దెనెక్కాక లక్షల కోట్లు సంపాదించనూ లేదు. ఇదీ కదా ఆదర్శనాయకుడంటే. అందుకే ఆయనంటే నాకు అమితమైన గౌరవం. మాటల్లో చెప్పలేనంత అభిమానం. పీవీ నరసింహారావు జయంతి సందర్భాన ఆయనకు వినమ్రంగా అంజలి ఘటిస్తున్నాను. ఈ దేశాన్ని అభివృద్ధిపథాన నడిపించాలని తపించే ప్రతీ నాయకుడికీ పీవీ ఆదర్శనీయులు. ఆయన ఎంత ఒదిగి ఉన్నా.. ఆయనలోని రాజనీతిజ్ఞత ఆయనను విజయునిగా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లింది. ఆయన మన తెలుగువానిగా తెలంగాణ గడ్డపై జన్మించడం తెలుగు ప్రజలు చేసుకున్న సుకృతం. ఆ పుంభావ సరస్వతికి, పరిపాలనా దిగ్గజానికి నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన ఘనంగా జేజేలు పలుకుతున్నాను’’ అని పేర్కొన్నారు.