పవన్ కులస్తులదే హడావుడి: డిప్యూటీ సీఎం నారాయణస్వామి
ABN , First Publish Date - 2022-03-01T01:25:18+05:30 IST
నటుడు పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా ఆయన సామాజికవర్గానికి చెందినవారే రెండు రోజులు హడావుడి చేశారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు.
తిరుపతి: నటుడు పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా ఆయన సామాజికవర్గానికి చెందినవారే రెండు రోజులు హడావుడి చేశారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి విమర్శించారు. తిరుపతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదోడు బాగుపడాలనే సీఎం జగన్ సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించారని చెప్పుకొచ్చారు. అఖండ, పుష్ప సినిమాలకు కూడా ఇదే టిక్కెట్ రేట్లు వర్తించాయని, భీమ్లానాయక్కు మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు అంతలా స్పందిస్తున్నారని ప్రశ్నించారు. పవన్ వంద కోట్లు పారితోషికం తీసుకుంటుంటే అందులో 50 కోట్లు ప్రజలకు ఖర్చు పెట్టాలన్నారు. సీఎం జగన్ను దూషించేవాళ్లంతా రాక్షస మనస్తత్వంతో ఉండేవాళ్లని చెప్పారు. జగన్పై కేసులు పెట్టినవాళ్లంతా పతనమైపోయారని, రాజకీయంగా శూన్యమైపోయారని, ఇక చంద్రబాబు వంతు మిగిలిందని నారాయణస్వామి తెలిపారు.