Pawan Kalyan: తెలుగు కవులకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2022-08-25T21:38:03+05:30 IST

తెలుగు కవులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు.

Pawan Kalyan: తెలుగు కవులకు అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్

అమరావతి (Amaravathi): కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు కవులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందనలు తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు పళ్లిపట్టు నాగరాజు (Nagaraju), సిరిసిల్లకు చెందిన పత్తిపాక మోహన్‌ (Mohan)లకు తన తరఫున, జనసేన పార్టీ పక్షాన హృదయపూర్వక అభినందనలు చెప్పారు. యువ విభాగంలో పురస్కారానికి ఎంపికైన పళ్లిపట్టు నాగరాజు రాసిన ‘యాలై పూడ్సింది’లో ఆయన రాసిన కవితల్లో ఒకటి చదివానన్నారు. నేటి యువత చైతన్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని ఆ అక్షరాలు చూపాయన్నారు. బాల సాహిత్య విభాగంలో పురస్కారం పొందిన పత్తిపాక మోహన్ కవితా సంకలనం ‘బాలల తాతా బాపూజీ’లో జాతిపిత గురించి భావి పౌరులకు అర్థమయ్యేలా చెప్పడం అభినందించదగ్గ ప్రయత్నమన్నారు. తెలుగు భాషను తెలుగు వారికి దూరం చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. అమ్మ భాషను కాపాడుకొంటూ భావి తరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. నాగరాజు, మోహన్ లాంటి కవులు చేస్తున్న ప్రయత్నాలకు పురస్కారాలు దక్కడం ముదావహం అన్నారు. ఈ స్ఫూర్తితో నవ కవులు, రచయితల నుంచి మరిన్ని ఉత్తమ రచనలు రావాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-25T21:38:03+05:30 IST