గుండాయిజం, రౌడీయిజం అణచడానికే రాజకీయాల్లోకి వచ్చా: Pawan
ABN , First Publish Date - 2022-07-10T23:22:14+05:30 IST
గుండాయిజం, రౌడీయిజం అణచడానికే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు.
అమరావతి: గుండాయిజం, రౌడీయిజం అణచడానికే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాతిక మంది రౌడీలను చూసి వేలమంది జనం భయపడుతున్నారని తెలిపారు. జనం కోసం దహించుకుపోవడానికైనా సిద్దపడాలని పిలుపునిచ్చారు. తన పరిధి దాటి సాటి మనుషుల కోసం పోరాడేవాడు.. శాశ్వతంగా నిలబడతాడని పేర్కొన్నారు. సమస్యల నిలయంగా ఏపీ మారిందన్నారు. టిడ్కో ఇళ్లు ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయని తెలిపారు.
ప్రజలను వాలంటీర్లు (volunteers) బెదిరిస్తున్నారని, మాఫియా వ్యవస్థలా వాలంటీర్లు తయారయ్యారని పవన్ దుయ్యబట్టారు. వైసీపీ (YCP) నేతలు తమ కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీస్ (Police), పంచాయతీరాజ్ వ్యవస్థ ఉందని, పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. గాంధీ గ్రామ స్వరాజ్య నినాదాన్ని చంపేశారని ధ్వజమెత్తారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయగానే సరిపోతుందా.. నిధులు ఇవ్వకుంటే గ్రామ స్వరాజ్యం ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. తనను ప్రశంసించిన దివ్యాంగుడి పెన్షన్ ఆపారని మండిపడ్డారు. ప్రభుత్వ సరిగా పనిచేస్తే తమకు వినతులు ఎందుకు వస్తాయని పవన్కల్యాణ్ నిలదీశారు.