పరిహారం చెల్లించండి
ABN , First Publish Date - 2022-09-25T05:17:48+05:30 IST
మల్లన్నసాగర్ రిజర్వాయర్ అదనపు టీఎంసీ ఓపెన్ కెనాల్ కాలువ నిర్మాణం కోసం తమ భూమిని అధికారులు తీసుకొని ఇంతవరకు పూర్తి పరిహారం చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్ గ్రామ భూ నిర్వాసితులు అవేదన వ్యక్తం చేశారు.
తొగుట, సెప్టెంబరు 24: మల్లన్నసాగర్ రిజర్వాయర్ అదనపు టీఎంసీ ఓపెన్ కెనాల్ కాలువ నిర్మాణం కోసం తమ భూమిని అధికారులు తీసుకొని ఇంతవరకు పూర్తి పరిహారం చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్ గ్రామ భూ నిర్వాసితులు అవేదన వ్యక్తం చేశారు. శనివారం భూ నిర్వాసితులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని తమకు పూర్తి పరిహారం చెల్లించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు విలేకరులతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ గ్రామంలో అదనపు టీఎంసీ ఓపెన్ కెనాల్ కాలువ నిర్మాణం కోసం 72 ఎకరాల భూమిని అధికారులు తమ నుంచి తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అందుకు గాను ఎకరాకు రూ.13లక్షలు చెల్లిస్తామని హామీ ఇచ్చి 2021జూలై 19న ఒక్కో ఎకరానికి రూ.8 లక్షలు మాత్రమే చెల్లించారన్నారు. మిగతా రూ.5 లక్షలు మూడు నెలల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చి ఏడాది దాటినా ఇంతవరకు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. భూమి తీసుకుని పరిహారం ఇవ్వకుండా వేధించడం మంచి పద్దతి కాదని మండిపడ్డారు. అధికారులు స్పందించి పూర్తి పరిహారం చెల్లించేలా చూడాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గ్రామ భూ నిర్వాసితులు బాల్రాజ్, రవీందర్, స్వామి, కృష్ణ, లింగం, కనకయ్య, నవీన్, మల్లేశం, బాబు, లక్ష్మి నర్సవ్వ, రాజు, పరశురాములు పాల్గొన్నారు.