షుగర్‌ ఫ్యాక్టరీల రైతులకు చెల్లింపులు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-07-01T06:37:49+05:30 IST

తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలకు చెరకు సరఫరా చేసిన రైతుల బకాయిలు, కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని జిల్లా రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

షుగర్‌ ఫ్యాక్టరీల రైతులకు చెల్లింపులు చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న రైతు సంఘం నాయకుడు ఎం.అప్పలరాజు


పాయకరావుపేట, జూన్‌ 30 : తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలకు చెరకు సరఫరా చేసిన రైతుల బకాయిలు, కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని జిల్లా రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. పాయకరావుపేటలో గురువారం ఏర్పాటైన సమావేశంలో సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ 2020-21 క్రషింగ్‌ సీజన్‌లో తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలకు చెరకు సరఫరా చేసిన రైతులకు బకాయిల కోసం పలుమార్లు ఆందోళనలు చేపట్టినా స్పందన కరువైందన్నారు.  రైతులు, కార్మికులకు పూర్తిస్థాయిలో చెల్లింపులు జరుపాల్సిన ప్రభుత్వం, ఫ్యాక్టరీల యాజమాన్యాలు కంటి తుడుపు చర్యగా తాండవ పరిధిలో రూ.52లక్షలు, ఏటికొప్పాక పరిధిలో రూ.40 లక్షలు రైతుల ఖాతాలకు జమచేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని ఆరోపించారు.  జిల్లా రైతు సంఘం నాయకులు గండి నాయనబాబు, సాయిరెడ్డి నారాయణమూర్తి, ఎస్‌వీనాయుడు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-07-01T06:37:49+05:30 IST