పేస్కేల్ జీవోను విడుదల చేయాలి : వీఆర్ఏలు
ABN , First Publish Date - 2022-07-01T06:01:56+05:30 IST
పేస్కేల్ జీవోను విడుదల చేయాలి : వీఆర్ఏలు
పెద్దేముల్/మోమిన్పేట/బొంరాస్పేట్/పరిగి, జూన్ 30 : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన పేస్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని వీఆర్ఏల సంఘం పెద్దేముల్ మండలాధ్యక్షుడు రమేష్, ప్రధానకార్యదర్శి సమీర్లు డిమాండ్ చేశారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. 55 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం ఆర్ఐ రాజిరెడ్డికి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. అలాగే సీఎం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మోమిన్పేట మండల వీఆర్ఏలు నిరసన వ్యక్తంచేశారు. వీఆర్ఏల సంఘం మండలాధ్యక్షుడు కె. రత్నయ్య మాట్లాడుతూ జేఏసీ పిలుపు మేరకు నిరసనతో కూడిన ప్లకార్డులు పట్టుకుని శాంతియుతంగా డిమాండ్లను తీర్చమని కోరుతున్నట్లు తెలిపారు. మహేశ్, రాజు, శారద, రాఘవేందర్, నర్సింహులు, మోహన్, వంశీ, వెంకటయ్య, మణెయ్య, వెంకటేశం పాల్గొన్నారు. సీఎం ప్రకటించిన పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, వీఆర్ఏల సంఘం మండలాధ్యక్షుడు యం.మోహన్ తదితరులు డిమాండ్ చేశారు. గురువారం బొంరాస్పేట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులకు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పరిగి తహాశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. వీఆర్ఏలకు పేస్కేల్ ఇచ్చి, సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏ సంఘం నాయకులు మహేందర్; సిద్దికిమియా, కవిత, ఆంజనేయులు పాల్గొన్నారు.