సరికొత్త ఆల్టైం కనిష్టానికి... పేటీఎం షేర్లు...
ABN , First Publish Date - 2022-03-22T20:16:40+05:30 IST
పేటీఎం షేర్లు సరికొత్త ఆల్ టైమ్ కనిష్టానికి చేరాయి. గత కొంతకాలంగా పేటీఎం షేర్లు దిగజారుతోన్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ : పేటీఎం షేర్లు సరికొత్త ఆల్ టైమ్ కనిష్టానికి చేరాయి. గత కొంతకాలంగా పేటీఎం షేర్లు దిగజారుతోన్న విషయం తెలిసిందే. గతేఏడాది నవంబరులో అరంగేట్రం చేసిన రోజున రూ. 1,961 ధరతో పోల్చుకుంటే... ఈ స్టాక్ దాదాపు 72 శాతం క్షీణించింది. బీఎస్ఈలో షేరు 4 శాతానికి పైగా పతనమై, రూ. 541.15 వద్ద ఆల్టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 35,915.27 కోట్లకు పడిపోయింది. గ్లోబల్ ఫైనాన్షియల్ మేజర్ మాక్వెరీ, బ్యాంకింగ్ లైసెన్స్ పొందే అవకాశాలు తగ్గుముఖం పట్టడంతోపాటు, రెగ్యులేటరీ హెడ్విండ్లను పేర్కొంటూ పేటీఎం కోసం దాని ధరల లక్ష్యాన్ని తగ్గించింది.
గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థపేటీఎం లక్ష్యాన్ని తగ్గించడం ఇది రెండోసారి. ఇది గతేడాది నవంబరులో స్టాక్పై కవరేజీని రూ. 1,200 టార్గెట్ ధరతో ప్రారంభించింది, ఇది గత నెలలో రూ. 700 కు తగ్గిపోయింది. తాజాగా... ఒక్కో షేరుకు రూ. 450 కు తగ్గిపోయింది. కాగా.. పేటీఎం వ్యవస్థ ఇతర వ్యవస్థలతో ధీటుగా పోటీపడుతూ వెళుతోన్న క్రమంలో... కొద్ది రోజుల్లోనే దాని షేరు ధర అనూహ్యంగా పుంజుకుంటుందని స్టాక్ మార్కెట్ వర్గాలు, సంబంధిత నిపుణులు పేర్కొంటున్నారు.