UAE-India travel: భారత ఎంబసీ కీలక ప్రకటన..!
ABN , First Publish Date - 2022-02-11T14:12:31+05:30 IST
కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రభావం కాస్తా తగ్గుముఖం పట్టడంతో గురువారం భారత ప్రభుత్వం విదేశీ ప్రయాణికులకు ప్రయాణ ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే.
దుబాయ్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రభావం కాస్తా తగ్గుముఖం పట్టడంతో గురువారం భారత ప్రభుత్వం విదేశీ ప్రయాణికులకు ప్రయాణ ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీ (సోమవారం) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈలోని భారత ఎంబసీ అక్కడి నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. యూఏఈ నుంచి భారత్కు వెళ్లేవారు ప్రయాణానికి 72 గంటల ముందు టెస్టు చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు చూపించడం తప్పనిసరి అని పేర్కొంది. అలాగే ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని తెలియజేసింది.
అయితే, కొవిడ్ పరీక్ష తాలూకు నెగెటివ్ రిపోర్టు లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను ప్రయాణికులు తప్పనిసరిగా ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. కాగా, టీకా ధృవపత్రాన్ని అప్లోడ్ చేసే సౌకర్యం కేవలం 82 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే భారత్ కల్పించింది. ఈ జాబితాలో యూఏఈ లేదు. కనుక యూఏఈ ప్రయాణికులు ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టును ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి అని ఎంబసీ తెలిపింది. దీంతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ను సమర్పించాలి.