మాదకద్రవ్యాలు విక్రయిస్తే పీడీ యాక్ట్
ABN , First Publish Date - 2022-08-19T05:28:30+05:30 IST
గంజాయి, గుట్కా, మాదకద్రవ్యాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ హెచ్చరించారు.
పెండింగ్ కేసుల్లో అలసత్వం వద్దు
సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్
సంగారెడ్డి రూరల్, ఆగస్టు 18: గంజాయి, గుట్కా, మాదకద్రవ్యాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ హెచ్చరించారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న కేసుల పట్ల అలసత్వం వహించవద్దని అధికారులకు సూచించారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న శారీరక, మానసిక దాడుల విషయమై కఠినంగా వ్యవహరించి, వాటికి కారణమైన దోషులకు శిక్షపడేలా చూడాలన్నారు. నేరాల అదుపులో భాగంగా ఆయా సబ్ డివిజన్లలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించాలని డీఎస్పీలకు సూచించారు. ఆన్లైన్ మోసాలు, లాటరీలు, ఓటీపీలు అడగడం, ఓటీపీ షేక్ చేసి ఇబ్బందులకు గురికావద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు డయల్ చేయాలన్నారు. బ్యాంకు దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల్లో సీసీ కెమెరాలు, అలారమ్స్ ఏర్పాటు చేసేలా సంబంధిత బ్యాంకు మేనేజర్లకు సూచించాలన్నారు. ఈ సమావేశంలో సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ డీఎస్పీలు రవీందర్రెడ్డి, భీమ్రెడ్డి, రఘు, ఎస్బీ ఇన్స్పెక్టర్ మహే్షగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు ప్రణాళికతో సాగాలి: ఎస్పీ
మెదక్ అర్బన్, ఆగస్టు 18: నేరాల నియంత్రణకు ప్రణాళికతో ముందుకు సాగాలని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా సిబ్బందితో నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేరాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. మహిళలు, పిల్లల రక్షణ విషయంలో దృష్టిసారించాలన్నారు. ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పూర్తి సాక్ష్యాలతో దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్షలు పడే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ బాలస్వామి, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు సైదులు, యాదగిరి రెడ్డి, డీసీఆర్బీ సీఐ రవీందర్, జిల్లాలోని సీఐ, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.