జాతరకు వేళాయె
ABN , First Publish Date - 2021-02-27T05:30:00+05:30 IST
గజ్జెల లాగులు ధరించిన యాదవుల నృత్యాలు.. భేరి నాదాలు.. ఓ లింగా.. ఓ లింగా అంటూ నామస్మరణ.. ఎటూ చూసినా కిటకిటలాడే భక్తులు.. ఐదు రోజులపాటు జరగనున్న సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతరలో కనిపించే దృశ్యాలివి. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి ప్రారంభంకానుంది.
నేటి నుంచి పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర
15లక్షలకు పైగా హాజరుకానున్న భక్తులు
1400 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు
ట్రాఫిక్ మళ్లింపు చర్యలు
(చివ్వెంల)
గజ్జెల లాగులు ధరించిన యాదవుల నృత్యాలు.. భేరి నాదాలు.. ఓ లింగా.. ఓ లింగా అంటూ నామస్మరణ.. ఎటూ చూసినా కిటకిటలాడే భక్తులు.. ఐదు రోజులపాటు జరగనున్న సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లింగమంతుల స్వామి జాతరలో కనిపించే దృశ్యాలివి. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి ప్రారంభంకానుంది. దిష్టిపూజ తర్వాత సూర్యాపేట మండలం కేసారం గ్రామంలోని ముంతబోయిన కుటుంబాల ఆధ్వర్యంలో 15 రోజులు ప్రత్యేక పూజ లు అందుకున్న దేవరపెట్టే ఆదివారం అర్థరాత్రి గుట్టపై కి చేరుకోవడంతో జాతర ప్రారంభమవుతుంది. మార్చి 4వ తేదీ వరకు జరగనున్న ఈ జాతరలో గొర్రె లు, మేకలను బలి ఇచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించి సౌడమ్మ అమ్మవారికి గంపలు అందజేసి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు.
తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరైన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర రెండేళ్లకోమారు జరుగుతుంది. సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో 65వ జాతీయ రహదారి వెంట దురాజ్పల్లి వద్ద ఉన్న పెద్దగట్టుపై లింగమంతులస్వామి ఆలయం ఉంది. యాదవుల ఆరాధ్య దైవంగా కొలిచే లింగమంతులస్వామిని గిరిజనులతోపాటు కులమతాలకు అతీతంగా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి జాతర ప్రారంభమై మార్చి 4న ముగుస్తుంది. జాతరకు రాష్ట్రం నుంచే గాక ఏపీ, ఒడిశా, చత్తీ్సఘడ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. జాతరకు సుమారు 15లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే రూ.1.33కోట్లతో ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వంరూ.2కోట్లు విడుదల చేసింది. జాతర ఏర్పాట్లను మంత్రి జగదీ్షరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్.భాస్కరన్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే జాతర కు సంబంధించిన రూట్మ్యా్పను విడుదల చేశారు.
మకర తోరణం తరలింపు
పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గొల్లబజార్లోని ఆలయం నుంచి మకరతోరణాన్ని శనివారం ఊరేగింపుగా పెద్దగట్టు దేవాలయానికి తరలించారు. తొలుత యాదవ పెద్దలు మకరతోరణం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భేరి చప్పుళ్లు, కఠారీల విన్యాసాల నడుమ మకరతోరణాన్ని గుట్టకు తరలించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, తండు శ్రీనివా్సయాదవ్, పోలెబోయిన నర్సయ్యయాదవ్, వసంత సత్యనారాయణపిళ్లె, కోడి సైదులు, సత్యనారాయణ, వూరగాయత్రి రాంమూర్తియాదవ్, వల్లపు, కోడి వంశస్థులు పాల్గొన్నారు.
1400మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు
జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1400 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జాతర ప్రదేశాలను 12 సెక్టార్లుగా విభజించి మూడు షిఫ్టుల్లో 24గంటలు బందోబస్తు నిర్వహిస్తారు. ఆరు గురు డీఎస్పీలు, 36 మంది సీఐలు, 102 మంది ఎస్ఐలు, ఏఏ్సఐలు, 180 మంది హెడ్కానిస్టేబుళ్లు, 690 మంది కానిస్టేబుళ్లు, 450 మంది హోంగార్డులు, 86 మంది మహిళా సిబ్బంది, నలుగురు క్యూఆర్టీ టీమ్ సిబ్బంది, ఆరుగురు ప్రత్యేక సిబ్బంది, బ్లూకోట్స్, షీటీమ్స్, మఫ్టీ టీమ్స్, ప్రత్యేక బృందాలు, రోప్పార్టీలు, పెట్రోకార్ సిబ్బంది, డాగ్స్క్వాడ్, బీడీ టీమ్స్, క్లూస్టీం సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. నాగర్కర్నూల్, వనపర్తి, వికారాబాద్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి సిబ్బంది బందోబస్తుకు వచ్చారు. అదేవిధంగా 40 సీసీ, రెండు డ్రోన్ కెమెరాలతో సెక్యూరిటీ సర్వేలైన్స్ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు.
ఏర్పాట్లు పూర్తి
జాతరకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యంతో పాటు శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. చలువ పందిళ్లు, పుణ్యస్నానాల కోసం షవర్లు ఏర్పాటు చేశారు. గుట్టపైన జీవాలను బలి ఇవ్వనుండటంతో రక్తాన్ని పీల్చి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు జెట్టింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు, గుట్టకు నలుమూలలా ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేశారు. చెరువు వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. భక్తులకు కరోనా లక్షణాలు ఉంటే అక్కడే పరీక్షలు చేసేందుకు వైద్య సిబ్బందితో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. 108, 104 అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు.
భారీ వాహనాల దారి మళ్లింపు
హైదరాబాద్-విజయవాడ రహదారిపై వెళ్లే లారీలు, గూడ్స్ వాహనాలు, కంటైనర్లను జాతర సందర్భంగా దారి మళ్లిస్తున్నారు. వాహనాలను నల్లగొండ జిల్లా నార్కట్పల్లి నుంచి నల్లగొండ, మిర్యాలగూడెం మీదుగా కోదాడ వైపు మళ్లిస్తారు. అదేవిధంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కోదాడ వద్ద దారిమళ్లి హుజూర్నగర్, మిర్యాలగూడెం, నల్లగొండ, నార్కట్పల్లి నుంచి వెళ్తాయి. ఈ ఆంక్షలు ఆదివారం నుంచి మార్చి 4వ తేదీ జాతర ముగిసే వరకు అమలులో ఉంటుంది. బస్సులు, ఆటోలు, సొంతవాహనాలకు ఆంక్షలు లేకపోవడంతో అవి యథావిధిగా నడుస్తాయి.
వాహనాలకు పార్కింగ్ ప్రదేశాల కేటాయింపు
జాతరకు సూర్యాపేట మీదుగా వచ్చే వాహనాలను రాంకోటితండా రోడ్డులో పార్కింగ్ స్థలం కేటాయించారు. కోదాడ, మునగాల, గుంపుల మార్గాల్లో వచ్చే వాహనాలను ఖాసీంపేట రోడ్డులో నిలపనున్నారు. అదేవిధంగా గరిడేపల్లి, పెన్పహాడ్ మార్గంలో వచ్చే వాహనాలను బాలికల గురుకుల పాఠశాల పక్క నుంచి ప్రస్తుత కలెక్టరేట్ కార్యాలయం వెనుక భాగంలో పార్కింగ్ చేస్తారు. మోతె, చివ్వెంల మీదుగా వచ్చే వాహనాలకు మున్యానాయక్తండా వద్ద పార్కింగ్ స్థలం కేటాయించారు.
జాతరకు ఆర్టీసీ బస్సులు
పెద్దగట్టు జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనుంది. జాతర సమీపంలోని మూడు డిపోల నుంచి 70 బస్సులు నిత్యం ప్రయాణికులకు సేవలందిస్తాయి. సూర్యాపేట డిపో నుంచి 40 బస్సులు, కోదా డ నుంచి 15 బస్సులు, మిర్యాలగూడెం నుంచి 15 బస్సుల ను జాతరకు కేటాయించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ని కొత్తబస్టాండ్,పాతబస్టాండ్, పీఎ్సఆర్ సెంటర్, ఖమ్మం క్రాస్రోడ్, వాణిజ్యభవన్ సెంటర్ల నుంచి ప్రయాణికులను జాతరకు చేరవేసేలా ఆర్టీసీ చర్యలు తీసుకుంది. సూర్యాపే టనుంచి జాతర వరకు పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.15, కోదాడ నుంచి పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.25, మిర్యాలగూడెంనుంచి పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.40 చార్జీగా వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మార్కెట్కు సెలవులు
సూర్యాపేట సిటీ: జాతర సందర్భంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు మా ర్చి 1 నుంచి 3 వరకు మూడు రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చై ర్పర్సన్ ఉప్పల లలిత తెలిపారు.
జాతరకు ముందే అపశ్రుతి
లారీ ఢీకొట్టడంతో విరిగిన ధ్వజస్తంభం
చివ్వెంల: జాతరకు ముందే అపశ్రుతి చోటు చేసుకుంది. జాతర ఏర్పాట్ల క్రమంలో చెరుకు లారీ పెద్దగట్టు గుట్ట కింద తూర్పు భాగంలోని ధ్వజస్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ధ్వజస్తంభం మూడు ముక్కలైంది. దేవరపెట్టె పెద్దగట్టుకు తీసుకురాగానే, ఈ ధ్వజస్తంభం వద్దే తొలి పూజ నిర్వహిస్తారు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఈ ధ్వజస్తంభం విరగడంతో ఘటనా స్థలాన్ని మంత్రి జగదీ్షరెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యతో కలిసి సందర్శించారు. జాతర ప్రభావం తగ్గకుండా వెంటనే కొత్త ధ్వజస్తంభం ఏర్పాటుచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాగా, ధ్వజస్తంభం చిన్నగా ఉండటంతో దాని స్థానంలో కొత్తదాన్ని ఇప్పటికే దేవాలయానికి గతంలోనే తెచ్చి ఉంచారు. దీన్ని ప్రతిష్ఠించాల్సి ఉంది. ప్రస్తుత ధ్వజస్తంభం ధ్వంసం కావడంతో శనివారం అర్ధరాత్రి దీన్ని ప్రతిష్ఠించారు.
జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సూర్యాపేట క్రైం: జాతర ఏర్పాట్లను సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ ఆర్.భాస్కరన్ శనివారం పరిశీలించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ, అధికారులు, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. వారి వెంట ఆర్డీ వో రాజేంద్రకుమార్, ఈవో కుశలయ్య, మునిసిపల్ కమిషనర్ రామాంజులరెడ్డి, తదితరులు ఉన్నారు.