Peetala Sujatha: మాధవ్పై చర్యలు తీసుకోకుండా అనితను బెదిరించడమేంటి..?
ABN , First Publish Date - 2022-08-10T00:41:01+05:30 IST
ఎంపీ మాధవ్ (Mp Madhav)పై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి పీతల సుజాత (Ex Minister Peetala Sujatha) అన్నారు. కైకలూరు టీడీపీ..
కైకలూరు, (ఏలూరు జిల్లా): ఎంపీ మాధవ్ (Mp Madhav)పై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి పీతల సుజాత (Ex Minister Peetala Sujatha) అన్నారు. కైకలూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ కమిటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీతల సుజాత మాట్లాడుతూ ఎంపీ గోరంట్ల మాధవ్ బరితెగించి వికృత చేష్టలకు పాల్పడినా సీఎం, రాష్ట్ర మంత్రులు చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని ఆమె విమర్శించారు. మహిళలకు ఏమైనా జరిగితే గన్ కన్నా ముందు సీఎం జగన్ (Cm Jagan) వస్తాడన్న మహిళా మంత్రి.. ఎంపీ వివాదంపై ఇంకా ఎంక్వైరీ జరుగుతుందనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర మంత్రులు , ఎంపీలు ఏం చేసినా చూస్తూ ఉండాలని ప్రజలకి ఒక సందేశం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఎంపీ అంశంపై మహిళా సంఘాలతో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత (Anitha)ను వైసీపీ (Ycp) నాయకులు బెదిరించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. మహిళలను బెదిరించే స్థాయికి వైఎస్ఆర్సీపీ దిగజారిందని పీతల సుజాత విమర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్పై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని సీఎం జగన్ మాట తప్పారన్నారు. మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం లేదని మంత్రి చెప్పడం హేయమని పీతల సుజాత మండిపడ్డారు.