పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-05-29T05:43:14+05:30 IST
జిల్లాలో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసులను తగ్గించడానికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు.
- డీజీపీ మహేందర్రెడ్డి
సిరిసిల్ల రూరల్, మే 28: జిల్లాలో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసులను తగ్గించడానికి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల పోలీసులతో నేరసమీక్ష సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ఎస్పీ రాహుల్హెగ్డేను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పెండింగ్ కేసులు, క్రైం ఎగెనెస్ట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై పోలీస్ అధికారులు తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధిస్తున్నారన్నారు. కొత్త కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించేదిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలని అన్నారు. కోర్టు స్టేలో ఉన్న కేసుల్లో జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోని సంబంధిత కోర్టులకు హాజరై పరిష్కరించే విదంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ నేరాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫంక్షనల్, వర్జికల్ వారీగా జిల్లా స్థాయిలో ప్రతిరోజు మానిటర్ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్లలో పనిచేసే వివిధ సెక్షన్ల ఇన్చార్జ్లతో వారి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారానికి ఒకసారి వారితో సమావేశాలు నిర్వహించి ఫంక్షనల్, వర్టికల్ పకడ్బందీగా అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్, నాగేంద్రచారి, రవికుమార్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.