అవ్వ పింఛను ఫైలు కదిలింది

ABN , First Publish Date - 2021-10-28T05:21:46+05:30 IST

102 ఏళ్ళ అవ్వ లక్ష్మమ్మకు ఆగిపోయిన పింఛను తిరిగి చెల్లించే ఏర్పాట్లు మొదలయ్యాయి.

అవ్వ పింఛను ఫైలు కదిలింది
శతాధిక అవ్వను పరామర్శిస్తున్న ఎంపీడీవో సుధాకర్‌రావు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

పరామర్శించిన అధికారులు, నాయకులు

అవ్వ స్థితి చూసి చలించిన ఎంపీడీవో


వెదురుకుప్పం, అక్టోబరు 27: 102 ఏళ్ళ అవ్వ లక్ష్మమ్మకు ఆగిపోయిన పింఛను తిరిగి చెల్లించే ఏర్పాట్లు మొదలయ్యాయి. ‘102 ఏళ్ల అవ్వకు పింఛను ఆపేశారు’  అంటూ ఆంధ్రజ్యోతిలో సోమవారం ప్రచురితమైన వార్త ఇటు అధికారులను, అటు రాజకీయ నాయకులను కదిలించింది. ఎంపీడీవో సుధాకర్‌రావు గ్రామ సచివాలయ ఉద్యోగులతో కలసి   కొమరగుంటలోని అవ్వ ఇంటికి వెళ్లి విచారించారు. ఎముకల గూడులా ఉన్న అవ్వను చూసి ఆయన చలించిపోయారు. వృద్ధులైన ఆమె కొడుకు, కోడలు అనారోగ్యంతో ఉన్నా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటున్న తీరుకు అభినందించారు. అవ్వకు పింఛను డబ్బులు ఇవ్వకపోవడంపై వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, వలంటీర్‌లపై ఎంపీడీవో మండిపడ్డారు. వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ జీతం నుంచి  అవ్వకు పింఛనుకు సరిపడే డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు. పింఛను పునరుద్ధరించే చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో ఆ పార్టీ మండల నాయకులు భీమినేని చిట్టిబాబు, పి.మోహన్‌మురళి, గంధమనేని జయశంకర్‌నాయుడు బుధవారం కొమరగుంటకు వెళ్లి అవ్వ లక్ష్మమ్మను పరామర్శించారు. ఆర్ధిక సాయం అందించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని అవ్వకు పింఛన్‌ అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వెదురుకుప్పం ఎంపీపీ ఎం.నాగరాణి, జడ్పీటీసీ సభ్యుడు చలంపాళ్యం సుకుమార్‌, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్‌రెడ్డి, ఎంపీటీసీ వేపరెడ్డి మునిచంద్రారెడ్డి కూడా అవ్వను పరామర్శించారు. పింఛను డబ్బు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.



Updated Date - 2021-10-28T05:21:46+05:30 IST