పెన్షన్.. టెన్షన్.!
ABN , First Publish Date - 2020-12-03T04:51:26+05:30 IST
పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో వివిధ రకాల పింఛన్లు అందజేస్తుంది.
ఆధార్ కార్డులో వయస్సు మార్పిడి.. ఆపై పింఛన్
ఎంపీడీవోలకు జాబితాలు.. ప్రతి గ్రామంలో సమగ్ర విచారణ
ఏలూరు మండలంలో 416 మంది గుర్తింపు : ఎంపీడీవో
ఏలూరు రూరల్, డిసెంబరు 2 : పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో వివిధ రకాల పింఛన్లు అందజేస్తుంది. అందులో వృద్ధాప్య పింఛన్కు 60 ఏళ్లు అర్హతగా నిర్ణయించింది. ఆధార్ కార్డులో వయస్సును ప్రామాణికంగా తీసుకుం టోంది. ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత రెండు మూడేళ్లు వయస్సు, ఇతరత్రా మార్పులకు అవకాశం ఇవ్వలేదు. తర్వాత ప్రజల నుంచి వినతులు అంద డంతో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో కొందరు ఆధార్ కార్డులో వయస్సు 60 ఏళ్లుగా మార్పించుకుని పింఛన్ పొందుతున్నారని ప్ర భుత్వం దృష్టికి వెళ్లింది. ఈ విధంగా ప్రతి మండలంలో వందలాది మందికి వృద్ధాప్య పింఛన్లు అందుతున్నట్టు నిర్ధారణకు వచ్చింది. గడిచిన మూడు, నాలుగేళ్లల్లో ఆధార్ కార్డులో వయస్సు మార్పు చేయించుకుని తద్వారా పింఛ న్ తీసుకుంటున్నవారి వివరాలను మండలాల వారీగా జాబితాలను గ్రామ సచివాలయాలకు పంపి విచారణ చేపట్టాల్సిందిగా సంబంధిత ఎంపీడీవోలను ఆదేశించింది. ఆ జాబితా ప్రకారం గ్రామ వలంటీర్ సదరు పింఛనుదారుడి ఇంటికి వెళ్లి విచారణ చేస్తున్నారు. ఆధార్ కార్డు జారీ తేదీ నుంచి పింఛన్ దరఖాస్తు చేసేంతవరకూ ఎన్ని పర్యాయాలు వయస్సు మార్పులు చేశారనే సమాచారం కచ్చితంగా వలంటీర్లకు అందించాలి. దీనిని బట్టి పింఛన్ కోసమే ఆధార్లో వయస్సును మార్చిది లేనిది నిర్ధారించనున్నారు. ఒకవేళ పింఛన్కు అర్హుడై ఉండి ఆధార్లో వయస్సు తప్పుగా నమోదై ఉంటే అటువంటి తప్పని సరిగా వయస్సు మార్పిడికి సంబంధించి ఆధారాలు అంటే పదో తరగతి మా ర్కుల జాబితా, జనన ధ్రు వపత్రం ఉంటే సమర్పించా ల్సి ఉంటుంది. ఈ రెండూ లేకుంటే ప్రభుత్వ వైద్యాధికా రి జారీ చేసిన మెడికల్ సర్టి ఫికెట్ సమర్పించాల్సి ఉం టుంది. పింఛన్ పొందుతున్న వారి వివరాలను అప్లోడ్ చేయడానికి ఒక యాప్ రూపొందించారు. విచారణ తర్వాత సంబంధిత అధికారులు తుది జాబితా తయారు చేస్తారు. ఈ విధంగా మండలంలో ఎంతమంది పింఛన్ పొందారన్న వివరాలు సంబంధిత ఎంపీడీవో మెప్మా, యూసీడీ మెయిల్కు వెళ్లాయని వెలుగు అధికారులు చెబుతున్నారు.
416 మందిని గుర్తించాం
తప్పుడు వివరాలతో పింఛన్ పొందుతున్న వివరాలు అందాయి. మండలంలో 416 మంది ఈ విధంగా పింఛన్ పొందుతున్నట్టు తేలింది. వీటితోపాటు ఈ ఏడాది కారు, బంగ్లా, 300 యూనిట్లు కరెంటు బిల్లు వచ్చినవారు కూడా పింఛన్ పొందుతు న్నట్టు మా దృష్టికి వచ్చింది. వీటన్నింటి మీద వలంటీర్ల చేత విచారణ జరిపిస్తున్నాం. సక్రమంగా ఉన్నవాటిని ఎలిజిబుల్ చేస్తాం. ఇందు కోసం ప్రత్యేక యాప్ను రూపొందించారు. ప్రస్తుతం విచారణ జరుగు తోంది. అక్రమంగా పింఛన్ పొందేవారి వివరాలు సేకరించి సక్ర మంగా లేకుంటే తొలగిస్తాం.
– జీఆర్ మనోజ్, ఎంపీడీవో