వైసీపీ పాలనపై ప్రజల్లో విసుగు
ABN , First Publish Date - 2022-05-26T07:01:37+05:30 IST
మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నింటా వెనుకబడిపోయిందని మాజీ మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. నాతవరంలో బుధవారం ఏర్పాటైన మినీ మహానాడులో మాట్లాడారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలంతా చంద్రబాబును సీఎం చేయాలి
నాతవరం మినీ మహానాడులో మాజీ మంత్రి అయ్యన్న
నాతవరం, మే 25 : మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నింటా వెనుకబడిపోయిందని మాజీ మంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడు అన్నారు. నాతవరంలో బుధవారం ఏర్పాటైన మినీ మహానాడులో మాట్లాడారు. జగన్ పాలనను చూసినవారంతా వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం అన్నిరకాల ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచిందని ఆరోపించారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరూపాయి కూడా తగ్గించకపో వడం దారుణమన్నారు. రైతుల నుంచి అన్నివర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారన్నారు. తాండవ రిజర్వాయర్ మెయిన్ గేటునుంచి రోజూ లీకేజీల రూపంలో చాలా వరకు సాగునీరు వృథాగా పోతోందన్నారు. దీనికి మరమ్మతుకు కేవలం ఎనిమిది లక్షల రూపాయలే ఖర్చు అవుతుందని తెలిసినా ఎమ్మెల్యే గణేశ్ పట్టించు కోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు చంద్ర బాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయా లని అయ్యన్న పిలుపునిచ్చారు. అనంతరం అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారంటే. వారిలో వైసీపీ పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. తల్లిని, చెల్లిని ఇంటినుంచి జగన్ గెంటించేశారని, ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏం సేవ చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాతవరం, నర్సీపట్నం, కోటవురట్ల మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.