ప్రజలకు ‘కొడాలి’ క్షమాపణ చెప్పాల్సిందే
ABN , First Publish Date - 2022-01-23T06:06:39+05:30 IST
మంత్రి కొడాలి నాని తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తిరుపతి అసెంబ్లీ జనసేన ఇన్చార్జి కిరణ్రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి డిమాండ్ చేశారు.
జనసేన డిమాండ్
తిరుపతి(కొర్లగుంట), జనవరి 22: మంత్రి కొడాలి నాని తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని తిరుపతి అసెంబ్లీ జనసేన ఇన్చార్జి కిరణ్రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వీరు తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. గుడివాడను గోవాగా మార్చారని, కొడాలికి సంబంధించిన కల్యాణ మండపంలో కేసినో వ్యవహారం దేశమంతా చూసిందన్నారు. అయితే మంత్రి మాత్రం తన కల్యాణ మండపంలో కేసినో, పేకాట జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పారన్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మాట తప్పకుండా పాటిస్తే రాష్ట్రానికి పట్టిన పీడ వదిలి పోతుందన్నారు. ఇలాగే వదిలేస్తే వచ్చే ఏడాదికి మలేసియా సంప్రదాయాన్ని తెస్తారని మండిపడ్డారు. మంత్రి తాను చేసిన తప్పులపై క్షమాపణ చెప్పకపోగా, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యం చేయడం అన్యాయమన్నారు. గౌరవంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే గుడివాడ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇక నగరంలోని 40 డివిజన్లలో రోడ్లు దెబ్బతిన్నాయని, తిరుపతి విమానాశ్రయానికి కూడా రహదారి సరిగ్గా లేదని, అలాంటిది ప్రతి జిల్లాకు ఎయిర్పోర్ట్ తీసుకొస్తానని సీఎం జగన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీచర్ల కుమారులు, కోడళ్లు విదేశాల్లో ఉండకూడదా? ఆస్తులు కూడబెట్టుకూడదా? అని మంత్రులను ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజే్షయాదవ్, నాయకులు సుమన్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.