Bipin Rawatకు స్వగ్రామమంటే ఎంతో ఇష్టం...
ABN , First Publish Date - 2021-12-09T18:28:56+05:30 IST
త్రివిధ దళాల చీఫ్ బిపిన్ రావత్ కు అతని స్వగ్రామం పౌరీ అంటే ఎంతో ఇష్టం. మృతికి అతని స్వగ్రామంలో ప్రజలు సంతాపం తెలిపారు....
మృతికి అతని పౌరీ గ్రామవాసుల సంతాపం
డెహ్రాడూన్ : త్రివిధ దళాల చీఫ్ బిపిన్ రావత్ కు అతని స్వగ్రామం పౌరీ అంటే ఎంతో ఇష్టం. మృతికి అతని స్వగ్రామంలో ప్రజలు సంతాపం తెలిపారు. బిపిన్ రావత్ తమ గ్రామ ప్రజలకు చాలా సన్నిహితుడని, త్వరలో తమ గ్రామానికి వస్తానని చెప్పారని అతని మామ భరత్ సింగ్ చెప్పారు.పదవీ విరమణ తర్వాత బిపిన్ రావత్ స్వగ్రామంలో ఇల్లు కట్టుకోవాలని ఉందని చెప్పినట్లు అతని మామ భరత్ సింగ్ పేర్కొన్నారు. బిపిన్ రావత్ ఉత్తరాఖండ్ లోని పౌరీ గ్రామంలోని ఆర్మీ అధికారి కుటుంబంలో జన్మించారు. రావత్ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్గా పదవీ విరమణ చేశారు.
జిల్లా కేంద్రానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న పౌరీ గ్రామానికి రోడ్డు నిర్మించాలని అక్కడి ప్రజలు కోరగా తన చివరి పర్యటనలో బిపిన్ రావత్ ఇచ్చిన ఆదేశంతో అధికారులు రహదారి నిర్మాణం చేపట్టారు. రహదారి నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుండగా ఇంతలో ఈ దుర్ఘటన జరిగిందని గ్రామవాసులు కన్నీళ్లతో చెప్పారు. రావత్ సైన్జ్ గ్రామంలో జన్మించిన చిన్న వయసులోనే పాఠశాల విద్య కోసం డెహ్రాడూన్ వెళ్లి పోయారు. యమకేశ్వర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పౌరీ చిన్న గ్రామం. పౌరీ గర్వాల్ బిపిన్ రావత్ కారణంగా జాతీయ ప్రాధాన్యం పొందిందని యమకేశ్వర్ ఎమ్మెల్యే రీతు ఖండూరి చెప్పారు.