తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు
ABN , First Publish Date - 2021-11-28T04:17:13+05:30 IST
కరెంట్, తాగు నీటి కోసం ప్రజలు రోడ్డెక్కారు. అర్ధవీడు మండలం మాగుటూరు పంచాయతీ పరిధిలోని కృష్ణానగర్ ప్రజలు గత నాలుగు రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడమేకాక పది రోజుల నుంచి నీరు రావడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు.
మాగుటూరు వాసుల నిరసన
నిలిచిన వాహనరాకపోకలు
కంభం (అర్థవీడు), నవంబరు 27: కరెంట్, తాగు నీటి కోసం ప్రజలు రోడ్డెక్కారు. అర్ధవీడు మండలం మాగుటూరు పంచాయతీ పరిధిలోని కృష్ణానగర్ ప్రజలు గత నాలుగు రోజులుగా కరెంట్ సరఫరా లేకపోవడమేకాక పది రోజుల నుంచి నీరు రావడం లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. వీరి నిరసనతో అటుగా వెళ్లే బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. గంటసేపు జరిగిన రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులుగానీ, నాయకులు గానీ ఎవరూ పట్టించుకోకపోవడంపై వారు తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడకు వచ్చిన కార్యదర్శితో ఆందోళన కారులు వాగ్వివాదానికి దిగారు. గ్రామంలో తాము ఉండాలా, ఊరు విడిచి పోవాలా అని నిలదీశారు. నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా లేదని, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. దీనిపై మీరేమంటారని కార్యదర్శిని ప్రశ్నించారు. పదిరోజులుగా తాగు నీరు కూడా రావడం లేదన్నారు. తక్షణమే సమస్య లను పరిష్కరించేవరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడం తో నిరసన విరమించారు.