ప్రదర్శనలు భళా

ABN , First Publish Date - 2022-08-16T06:45:38+05:30 IST

పాడేరులో సోమవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో వివిధ పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ప్రదర్శనలు భళా
కొయ్యూరు ఆశ్రమ బాలుర మల్లకంబ విన్యాసం

మొదటి స్థానంలో నిలిచిన గిరిజన సంక్షేమం- కాఫీ శకటం

ఉత్తమ ప్రదర్శనలకు బహుమతుల ప్రదానం

పాడేరు, ఆగస్టు 15 : పాడేరులో సోమవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో వివిధ పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అలాగే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శకటాల ప్రదర్శన అబ్బురపరిచింది. తలారిసింగి ఆశ్రమ పాఠశాల బాలురు, శ్రీకృష్ణాపురం, ఇంగ్లీషు మీడియం స్కూల్‌, కస్తూర్బా విద్యాలయం బాలికలు, సెయింట్‌ ఆన్స్‌ విద్యార్థులు, లోచలిపుట్టు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు, మోదమాంబ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య, గేయ ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. కొయ్యూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు చేసిన మల్లకంబ విన్యాసాలు, తలారిసింగి ఆశ్రమ విద్యార్థుల ఫైర్‌జంప్‌, గురుకుల కళశాల బాలికల ధింసా నృత్యం అలరించాయి. ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన తలారిసింగి ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ప్రథమ, పాడేరు గురుకుల కళాశాల బాలికలకు ద్వితీయ, కొయ్యూరు ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు తృతీయ బహుమతులు దక్కాయి. 

గిరిజన సంక్షేమం- కాఫీ శకటానికి ప్రథమ స్థానం

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శకటాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృధ్ది సంస్థ, గిరిజన సంక్షేమం-కాఫీ విభాగం, వ్యవసాయ-ఉద్యాన వన శాఖలు, ఐసీడీఎస్‌, పర్యాటక శాఖలు శకటాలను ప్రదర్శించారు. వాటిలో గిరిజన సంక్షేమం-కాఫీ శకటానికి ప్రథమ స్థానం, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు ద్వితీయ స్థానం, ఐసీడీఎస్‌కు తృతీయ స్థానంలో నిలిచాయి. గిరిజన సంక్షేమం-కాఫీ శకటంలో సంప్రదాయ ఆయుధాలను ధరించి, ఆదివాసీల వేషధారణలో ప్రదర్శన ఇచ్చిన జి.మాడుగుల మండలం కొత్తపల్లి గ్రామ ఆదిమజాతి గిరిజన యువతను మంత్రి అమర్‌నాథ్‌, జిల్లా అధికారులు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు అతిథులు బహుమతులను ప్రదానం చేశారు. 

Updated Date - 2022-08-16T06:45:38+05:30 IST