చిరును చులకన చేసేలా మంత్రి పేర్నినాని వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-23T17:29:39+05:30 IST

జగన్, చిరంజీవి భేటీపై పేర్నినాని చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని చులకన చేసేవిలా ఉన్నాయి.

చిరును చులకన చేసేలా మంత్రి పేర్నినాని వ్యాఖ్యలు

అమరావతి: సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీపై మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలు చిరంజీవిని చులకన చేసేవిలా ఉన్నాయి. ముఖ్యమంత్రి నివాసంలో భోజనం చేసేందుకు మాత్రమే చిరు వచ్చారని మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘జగన్ నివాసానికి చిరంజీవి ఏదో భోజనానికి వచ్చారు.. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు.. సినిమా టిక్కెట్లపై సంప్రదింపులు సచివాలయంలో జరుగుతాయి కానీ, ఇంట్లో జరుగుతాయా? ఇదేమైన చంద్రబాబు ప్రభుత్వమా?’’ అని పేర్ని నాని ప్రశ్నించారు. చిరంజీవి పర్యటనకు ప్రాధాన్యం లేదని భోజనం చేసేందుకే వచ్చారని మంత్రి తేల్చి చెప్పారు.


సీఎం జగన్ ఇంట్లో భోజనం చేసేందుకు చిరంజీవి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అమరావతికి వెళ్లారా? సినీ పరిశ్రమ అంశాలపై చర్చించానని ఆరోజే చిరంజీవి చెప్పారు. చిరు చెప్పింది నిజమైతే మరి మంత్రి అబద్దం చెప్పారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు సినీ, రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి.


చిరంజీవి ఏం చెప్పారంటే.. 

ఈనెల 13న జగన్‌ను కలిసి వచ్చిన తర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘‘టికెట్ల ధరల సమస్య జటిలమవుతున్న నేపథ్యంలో నన్ను రమ్మని సీఎం ఆహ్వానించారు. పండగ పూట ఈ సమావేశం సంతృప్తిగా సాగింది. నన్ను ఒక సోదరుడిలా ఆహ్వానించారు. జగన్‌ సతీమణి భారతి స్వయంగా వడ్డించారు. ఇద్దరూ ఒక కుటుంబ సభ్యుడిలా మర్యాదలు చేశారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. నేను చెప్పిన అన్ని సమస్యలను జగన్‌ సానుకూలంగా విన్నారు. రాసుకున్నారు. ఒకరి పక్షాన గాక అందరి వైపు ఉంటానని, ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు. టికెట్‌ ధరల జీవోపై పునరాలోచన చేస్తామని చెప్పడం ఆనందాన్ని కలిగించింది. సినీ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ సీఎంకు వివరించాను. జగన్‌ ఇచ్చిన భరోసాతో ధైర్యం వచ్చింది. సినీ పరిశ్రమవారు ఎవరూ అభద్రతాభావానికి లోనుకావద్దు. రెండు, మూడు వారాల్లో సానుకూల నిర్ణయం వెలువడుతుంది. నిర్ణయం తీసుకునేలోగా మరోసారి కలసి మాట్లాడుదామని జగన్‌ చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసేముందు మళ్లీ ఆహ్వానిస్తానన్నారు’’ అని చెప్పారు. మంత్రేమో... ఆ భేటీలో సినిమా టికెట్లపై చర్చ జరగనే లేదని, చిరంజీవి భోజనం చేసి... కుశల ప్రశ్నలు వేసుకుని వెళ్లిపోయారని అంటున్నారు!

Updated Date - 2022-01-23T17:29:39+05:30 IST