పట్టుదలతోనే విజయం!

ABN , First Publish Date - 2021-01-10T05:47:30+05:30 IST

రంగాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు రాము, చిన్నవాడు సోము.

పట్టుదలతోనే విజయం!

రంగాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు రాము, చిన్నవాడు సోము. ఇద్దరూ ఒకే బడిలో చదువుకొనే వారు. రామయ్య స్నేహితులు అప్పుడప్పుడు ‘‘రామయ్యా! నువ్వు ఎలాగూ ఇక వ్యవసాయం చేయలేవు. పెద్దవాణ్ణి చదువు మాన్పించి పొలం పనులకు పంపించవచ్చు కదా!’’ అని అనే వారు. వాళ్లు చెప్పింది విని రామయ్య ఆలోచనలో పడ్డాడు.


ఒకరోజు ఇద్దరు కుమారులను పిలిచి ‘‘మీలో ఒకరు చదువుకోండి. ఒకరు వ్యవసాయం చేయండి. ఎవరు చదువుతారు, ఎవరు వ్యవసాయం చేస్తారో మీరే నిర్ణయించుకోండి’’ అని చెప్పాడు.


ఇద్దరికీ చదువుకోవాలనే కోరిక ఉండడంతో నేనంటే నేను చదువుకుంటాను అని గొడవపడ్డారు. చివరకు చిన్న వాడు సోము అన్న బాగోగులు కోరుతూ వ్యవసాయం చేయడానికి ఒప్పుకున్నాడు.  పైచదువుల కోసం రాముని పట్నం పంపించాడు రామయ్య. చిన్న కొడుకు సోముకి వ్యవసాయం నేర్పించాడు. చదువుకోవడానికి పట్నం వెళ్లిన రాము చెడు స్నేహాలు చేసి వ్యసనాలకు అలవాటై చదువులో వెనకబడ్డాడు.


సోము పట్టుదలతో వ్యవసాయం చేసి, బాగా డబ్బు సంపాదించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇటు వ్యవసాయంలో, అటు చదువులోనూ రాణించని రాము ఎందుకు పనికిరాని వాడిగా తయారయ్యాడు. ఊరి వాళ్లందరూ సోముని మెచ్చుకుంటుంటే రాము బాధపడ్డాడు. పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని సోము నిరూపించాడు.

పంపినవారు : ఎన్‌.రాజారెడ్డి, గోరంట్ల, అనంతపురం జిల్లా


Updated Date - 2021-01-10T05:47:30+05:30 IST