మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-23T05:03:06+05:30 IST
భార్యా బిడ్డలు దూరంగా ఉండటంతో పాటు అనారోగ్యం వెంటాడుతుండటంతో ఓ వ్యక్తి మనస్తాపానికి గురె ఆత్మహత్య చేసుకున్నాడు.
నెల్లూరు(క్రైం),జనవరి 22: భార్యా బిడ్డలు దూరంగా ఉండటంతో పాటు అనారోగ్యం వెంటాడుతుండటంతో ఓ వ్యక్తి మనస్తాపానికి గురె ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నెల్లూరు నేతాజీనగర్లో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు సమాచారం మేరకు నేతాజీనగర్ 8వ వీధిలో నివాసం ఉంటున్న శేఖర్(39)కు తోటపల్లిగూడూరు మండలం మల్లికార్జునపురానికి చెందిన శాంతితో సుమారు 22 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులున్నారు. శేఖర్ కార్పెంటర్. శాంతి విజయమహల్ గేటు సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆయాగా పనిచేస్తోంది. ఈ క్రమంలో శేఖర్ మద్యానికి బానిసై సంపాదనంతా తాగుడుకే ఖర్చు చేసేవాడు. దీంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో పాటు శేఖర్కు టీబీ వ్యాధి రావడంతో ఆరోగ్యం క్రమేణా క్షీణిస్తూ వచ్చింది. వైద్యులతోపాటు భార్య కూడా మద్యం మానేయాలని సూచించారు. భర్త వినకపోవడంతో ఎనిమిది నెలల క్రితం తన పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. శేఖర్ అప్పుడప్పుడూ భార్యాపిల్లల వద్దకు వెళ్లి వచ్చేవాడు. సంక్రాంతికి కూడా వెళ్లి కనుమ రోజు తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో శనివారం శేఖర్ ఉంటున్న ఇంటి నుంచి తీవ్ర దుర్గంధం వస్తుండటం స్థానికులు భార్య శాంతికు సమాచారం అందించారు. దీంతో ఆమె కుటుంబసభ్యులతో నెల్లూరుకు చేరుకొని ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా శేఖర్ ఉరివేసుకొని మృతి చెందాడు. మృతదేహం కుళిపోయి గుర్తుపెట్టలేని స్థితిలో ఉంది. ఈ మేరకు ఆమె వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ ఆంజనేయులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టరం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.