’పేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-05-20T06:06:27+05:30 IST

స్థానిక మేజరు పంచాయతీ కార్యదర్శి ఎం.సత్యప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి.

’పేట పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌
పంచాయతీ కార్యదర్శి ఎం.సత్యప్రసాద్‌

సత్యప్రసాద్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ

పాయకరావుపేట, మే 19: స్థానిక మేజరు పంచాయతీ కార్యదర్శి ఎం.సత్యప్రసాద్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందాయి.

పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం.సత్యప్రసాద్‌ పంచాయతీకి చెందిన పలు స్థలాలు ఆక్రమణలకు గరవుతున్నా, అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అంతేకాక కార్యదర్శికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనలు కూడా నిర్వహించారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శి విధులకు సక్రమంగా హాజరుకావడంలేదని, తమ వార్డుల్లో సమస్యల పరిష్కారం కోసం కలిసినా పట్టించుకోవడంలేదని, పాలకవర్గ సమావేశాలకు గైర్హాజరవుతున్నారని కొంతమంది పంచాయతీ వార్డు సభ్యులు సైతం జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేశారు. వీటిపై స్పందించిన పంచాయతీరాజ్‌ శాఖ జిల్లా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదికను రాష్ట్ర ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న సత్యప్రసాద్‌ ఈ నెల మొదటి వారం నుంచి సెలవుపెట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సత్యప్రసాద్‌ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి  జిల్లా అధికారులకు ఉత్తర్వులు అందినట్టు తెలిసింది. దీనిపై ఎంపీడీఓ ఎ.ఎ.సాంబశివరావును వివరణ కోరగా పాయకరావుపేట పంచాయతీ కార్యదర్శి ఎం.సత్యప్రసాద్‌ని రాష్ట్ర ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారని, అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా తమకు అందలేని చెప్పారు.

Updated Date - 2022-05-20T06:06:27+05:30 IST