EWS quota: ‘ఆ రాజ్యాంగ సవరణ మోసపూరితం’

ABN , First Publish Date - 2022-09-13T22:09:07+05:30 IST

ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నవారికి ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో

EWS quota: ‘ఆ రాజ్యాంగ సవరణ మోసపూరితం’

న్యూఢిల్లీ : ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నవారికి ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం వల్ల భారత రాజ్యాంగం గుర్తింపు మారుతుందని ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నవారు ఆరోపించారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అమలు చేస్తున్న 103వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. 


దేశంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలు (Economically Weaker Sections-EWS)కు ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ  103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ చట్టం రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. 


పిటిషనర్ల తరపున జీ మోహన్ గోపాల్ మంగళవారం వాదనలు వినిపిస్తూ, 103వ రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని ఆరోపించారు. కులాల ప్రాతిపదికపై దేశాన్ని ఇది విభజిస్తోందనేది క్షేత్ర స్థాయిలో వాస్తవమని తెలిపారు. రాజ్యాంగానికి ప్రజల మనసుల్లో ఉన్న గుర్తింపును ఇది మార్చుతుందన్నారు.  బలహీనుల కన్నా గొప్పవారిని పరిరక్షించేదే రాజ్యాంగమనే భావన ప్రజల్లో కలుగుతుందన్నారు. 


సాంఘిక న్యాయం జరగాలనేది రాజ్యాంగ దార్శనికత అని, ఈ దార్శనికతపై ఈ సవరణ దాడి చేస్తోందని ఆరోపించారు. సమానావకాశాలను పొందడమనేది వెనుకబడిన తరగతులవారికి ఎదురయ్యే సమస్య అని, అవకాశాల్లో సమానత్వాన్ని మింగేయని రీతిలో ప్రాతినిధ్యానికి భరోసా ఇవ్వడానికి మాత్రమే రిజర్వేషన్ అవసరమని వాదించారు. ప్రాతినిధ్యం లేనివారికి ప్రాతినిధ్యం కల్పించడం కోసం మాత్రమే రిజర్వేషన్ ఉండాలన్నారు. 


2020 ఆగస్టులో ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిన సంగతి తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్‌బీ పర్దీవాలా, జస్టిస్ బేలా త్రివేది రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరుపుతోంది. 


103వ రాజ్యాంగ సవరణ చట్టం రాజ్యాంగ బద్ధతను నిర్థరించేందుకు క్రింద పేర్కొన్న మూడు అంశాలను పరిశీలించాలని గత వారం సుప్రీంకోర్టు (Supreme Court) నిర్ణయించిన సంగతి తెలిసిందే. 


- ఆర్థిక పరిస్థితిని ప్రాతిపదికగా చేసుకుని రిజర్వేషన్లు కల్పించడం వంటి ప్రత్యేక నిబంధనలను రూపొందించి, అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇవ్వడం  రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందా? 


- ప్రైవేట్ అన్ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కల్పనకు ప్రత్యేక నిబంధనలను రూపొందించి, అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇవ్వడం రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందా? 


- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పరిధి నుంచి సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు/ఓబీసీలు/ఎస్సీ/ఎస్టీలను మినహాయించడం రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమవుతుందా?


Updated Date - 2022-09-13T22:09:07+05:30 IST