ఏపీలో రికార్డు స్థాయిలో ఇంధన ధరలు
ABN , First Publish Date - 2022-05-26T05:14:33+05:30 IST
పెట్రోల్ డీజిల్ ధరల్లో దక్షిణాదిలోని తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి మహ్మద్ నసీర్ మండిపడ్డారు.
బాదుడే బాదుడు కార్యక్రమంలో మహ్మద్ నసీర్
గుంటూరు (సంగడిగుంట) మే 25 : పెట్రోల్ డీజిల్ ధరల్లో దక్షిణాదిలోని తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి మహ్మద్ నసీర్ మండిపడ్డారు. బుధవారం స్థానిక బస్టాండు ఎదుట పెట్రోలు బంకు వద్ద ప్లకార్డుల ద్వారా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితులను వైసీపీ ప్రభుత్వం సృష్టించిందని ఆరోపించారు. కరోనాతో పనులను కోల్పోయి, ఆదాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం తన ఖజానా నింపుకోవడం కోసం పెట్రోల్, డీజిల్పై పన్నులను పెంచడం దారుణమన్నారు. పెట్రోల్, డీజిల్పై కేరళ ప్రభుత్వం రూ.6, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం రూ. 8 వరకు వ్యాట్ తగ్గించిందన్నారు. అదే స్పూర్తితో దేశంలోని సుమారు 23 రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినా ఏపీలో మాత్రం వ్యాట్ తగ్గించేది లేదని మంత్రులు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జాగర్లమూడి శ్రీనివాసరావు, గోళ్ల ప్రభాకర్, వేములకొండ శ్రీనివాస్, ఎల్లావుల అశోక్, పఠాన్ జమీర్, సయ్యద్ షఫీ, శ్రీనివాస్ రెడ్డి, కందుకూరి వెంకట్, కొనకళ్ళ సత్యం, వేల్చూరి కిరణ్, ఆంజనేయప్రసాద్, మారాసు మురళి, మహిళా నేతలు గుడిపల్లి వాణి, వజ్జా లక్ష్మి, షేక్ సలీమా, మువ్వా శైలజ, పద్మ, వాణి చౌదరి, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ కార్పోరేటర్ అభ్యర్ధులు పాల్గొన్నారు.