Mumbai: మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
ABN , First Publish Date - 2021-10-05T14:31:39+05:30 IST
దేశంలో మంగళవారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి....
ముంబైలో రూ.108.67కి చేరిన పెట్రోల్
ముంబై : దేశంలో మంగళవారం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో మంగళవారం పెట్రోల్ లీటరు ధర 108.67 రూపాయలకు పెరిగింది. ఢిల్లీలో పెట్రోల్ లీటరుపై 25 పైసలు, డీజిల్ లీటరుకు 30 పైసలు పెరిగింది. ఢిల్లీలో మంగళవారం పెట్రోల్ లీటరు ధర రూ.102.64, డీజిల్ లీటరు ధర రూ.91.07కు పెరిగిందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్) కారణంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. దేశంలోనే అత్యధికంగా ముంబైలో పెట్రోల్,డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.
ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ.108.67, డీజిల్ లీటరు ధర రూ.98.80 కి పెరిగింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం,హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధిదారులు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు రేట్లను పరిగణనలోకి తీసుకొని ప్రతిరోజూ ఇంధన రేట్లను సవరిస్తున్నారు. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.23, లీటర్ డీజిల్ ధర రూ. 95.59గా ఉన్నాయి. కోల్కత్తాలో పెట్రోల్ రూ. 103.36, డీజిల్ రూ. 94.17కు పెరిగాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు మంగళవారం మళ్లీ పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడనుంది.పైపైకి ఎగబాకుతున్న పెట్రో ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు.