delhi: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ABN , First Publish Date - 2021-10-01T14:01:31+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు మూడు సంవత్సరాల గరిష్ఠస్థాయికి చేరాయి...

delhi: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు మూడు సంవత్సరాల గరిష్ఠస్థాయికి చేరాయి. దీంతో శుక్రవారం భారత దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 25 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.101.64 నుంచి రూ.101.89 కు పెరిగింది. డీజిల్ ధర లీటరుపై 30 పైసలు పెరిగింది. లీటరు డీజిల్ ధర రూ.89.87 ఉండగా అది రూ.90.17కు పెరిగింది. ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ.107.95, డీజిల్ ధర 97.84రూపాయలకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో పెట్రోలు ధర లీటరుకు 26 పైసలు పెరిగి 106రూపాయలకు పెరిగింది. డీజిల్ లీటరు ధర 33 పైసలు పెరిగి రూ.99.08 అయింది.


మూడు వారాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పెట్రోలు ధరలు పెరిగాయి. దేశంలోని మెట్రో నగరాల్లోకల్లా ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. విలువ ఆధారిత పన్నులు, వ్యాట్ కారణంగా ఇంధన రేట్లు రాష్ట్రాల వారీగా మారుతూ ఉన్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధిదారులు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలను రూపాయి-డాలర్ మారకపు రేట్లను పరిగణనలోకి తీసుకుని ప్రతిరోజూ ఇంధన రేట్లను సవరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి అమలు చేస్తున్నారు.


Updated Date - 2021-10-01T14:01:31+05:30 IST